చైనా మిలిటరీ శక్తితో పోటీ పడే సామర్థ్యంగానీ లేదా ఉద్దేశాలుగానీ భారత్కు లేవని ఇటీవల చెప్పిన భారత నావికా దళ అధిపతి సురేష్ మెహతా గురువారం మాట్లాడుతూ.. హిందూ మహాసముద్రంలో మన ఉనికిని చూసి చైనా భయపడుతుందన్నారు. శ్రీలంక, పాకిస్థాన్, మయన్మార్ దేశాల్లో నౌకాశ్రయాల నిర్మాణానికి సాయం చేయడం ద్వారా చైనా ఈ భయాన్ని తొలగించుకోవాలనుకుంటుందని చెప్పారు.
హిందూ మహాసముద్రంలోకి అడుగుపెట్టేందుకే చైనా ఈ దేశాల్లో వ్యూహాత్మకంగా నౌకాశ్రయాల నిర్మాణానికి సాయం చేస్తుందని సురేష్ మెహతా అభిప్రాయపడ్డారు. భారత నేవీ హిందూ మహాసముద్రంలో ఉండటంపై చైనా ఆందోళన చెందుతోంది. మనం హిందూ మహాసముద్రంలో ఉండటం వారికి భయం కలిగిస్తోంది. వారు ఈ సముద్రంలోకి అడుగుపెట్టడం సులభం కాదు.
అందువలనే వ్యూహాత్మకంగా పొరుగుదేశాల్లో నౌకాశ్రయాల నిర్మాణం ద్వారా వారు ఇక్కడికి రావాలనుకుంటున్నారని మెహత్ గురువారం విలేకరులతో చెప్పారు. ఇదిలా ఉంటే ఆగస్టు 10న సురేష్ మెహతా మాట్లాడుతూ.. మిలిటరీ శక్తిపరంగా చైనాతో పోటీ పడే సామర్థ్యం భారత్కు లేదన్నారు. అంతేకాకుండా ఆ ఉద్దేశం కూడా భారత ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
తాజాగా సురేష్ మెహతా పొరుగు దేశాల్లో నౌకాశ్రయాల నిర్మాణం చైనా వ్యూహాత్మక విధానాల్లో భాగమేనని తెలిపారు. చైనాతో ఆయుధ రేసులో భారత్ పాల్గొనదని, దీనికి బదులుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారి సంఖ్యాబలానికి ధీటుగా నిలిచే ప్రయత్నం చేయవచ్చన్నారు.
చైనా సంఖ్యాబలంతో పోటీ పడే ఉద్దేశం భారత్కు లేదు. దీనిని సమం చేయడం మనకు ఎప్పటికీ సాధ్యం కాకపోవచ్చు. అంతేకాకుండా సంఖ్యాబలాన్ని సమం చేసే ప్రయత్నాలేవైనా ఎన్నో వనరులను వృధా చేస్తాయి. చైనా ఆయుధ సంపదకు ధీటుగా నిలిచేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి పెట్టడం ఉత్తమ మార్గమని మెహతా తెలిపారు.