పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ 2002లో రాశారని భావిస్తున్న వీలునామాను బుధవారం లాస్ ఏంజెలెస్ కోర్టులో దాఖలు చేశారు. ఈ వీలునామాలో తన మొత్తం ఎస్టేట్ను కుటుంబ ట్రస్టుకు రాశారు. తన మాజీ భార్య డెబ్బీ రోవే ప్రస్తావన ఇందులో లేదు. తన బిడ్డల సంరక్షణ బాధ్యతలను తల్లి కేథరీన్ చూసుకోలేని పక్షంలో, వారి సంరక్షణ బాధ్యతలను తన స్నేహితురాలు డయానా రాస్ స్వీకరించాలని జాక్సన్ ఈ వీలునామాలో పేర్కొన్నారు.
జాక్సన్ ఈ వీలునామాపై జులై 7, 2002న సంతకం చేశారు. ఆ సమయంలో జాక్సన్ ఎంతో ఇష్టపడి కట్టుకున్న నెవర్లాండ్ ఎస్టేట్ విలువ 500 మిలియన్ డాలర్లకుపైగా ఉంది. తన తల్లి కేథరీన్ జాక్సన్కు ఏదైనా జరిగినపక్షంలో తన ముగ్గురు బిడ్డల గార్డియన్గా డయానా రాస్ను జాక్సన్ ఈ వీలునామాలో పేర్కొన్నారు. 1960వ దశకంలో ఎడ్సులీవాన్ షోకు జాక్సన్ను రాస్ పరిచయం చేశారు. వారి కెరీర్కు ఈ షో ఎంతో ఉపయోగపడింది. మైఖేలా జాక్సన్కు డయానా రాస్ చిరకాల మిత్రురాలు.
లాస్ ఏంజెలెస్ సుపీరియర్ కోర్టులో ప్రవేశపెట్టిన వీలునామా ప్రకారం.. జాక్సన్ ఆస్తులన్నీ మైఖేల్ జాక్సన్ ఫ్యామిలీ ట్రస్టుకు చెందుతాయి. వీలునామాలో ఎస్టేట్తోపాటు, 2005 బీటెల్స్ పాటల హక్కులు కూడా పొందుపరిచారు. ఇదిలా ఉంటే ఇటీవల గుండెపోటుతో మరణించిన పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ అంత్యక్రియలు జూన్ 5న జరగనున్నట్లు తెలుస్తోంది. ఆయన భౌతికకాయాన్ని నెవర్లాండ్ ఎస్టేట్లో శుక్రవారం నుంచి అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు.