తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ అధిపతి బైతుల్లా మెహసూద్ మరణం పాకిస్థాన్లో తీవ్రవాదులపై జరుగుతున్న యుద్ధంలో చోటుచేసుకున్న కీలక పరిణామమని రిచర్డ్ హోల్బ్రూక్ తెలిపారు.
అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) జరిపిన డ్రోన్ (మానవరహిత యుద్ధ విమానం) దాడిలో మెహసూద్ గత బుధవారం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి.
మెహసూద్ మరణించాడని అమెరికా, పాక్ యంత్రాంగాలు చెబుతుండగా, తాలిబాన్ మాత్రం అతను బతికే ఉన్నాడని ప్రకటించారు. ఇదిలా ఉంటే గడిచిన నెల రోజుల్లో రెండోసారి పాక్ పర్యటనకు విచ్చేసిన ఆఫ్ఘన్- పాక్ అమెరికా ప్రత్యేక రాయబారి రిచర్డ్ హోల్బ్రూక్ గురువారం మాట్లాడుతూ.. సీఐఏ డ్రోన్ దాడిలో బైతుల్లా మెహసూద్ మృతి చెందడాన్ని కీలక పరిణామంగా వర్ణించారు.
మరోవైపు తీవ్రవాదంతో సతమతమవుతున్న ఈ ప్రాంతంలో తాలిబాన్ల మధ్య ఇప్పుడు నాయకత్వ పోరు జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఇది కూడా మంచి వార్తేనని రిచర్డ్ హోల్బ్రూక్ పేర్కొన్నారు. మెహసూద్ మరణం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పడం కష్టమన్నారు.