పాకిస్థాన్ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతకు తమ దేశం భేషరతుగా మద్దతును తెలుపుతున్నట్లు చైనా ప్రధానమంత్రి వెన్ జియబావో పునరుద్ఘాటించారు. బుధవారం పాకిస్థాన్ విదేశాంగమంత్రి హీనా రబ్బానీ ఖర్తో బీజింగ్లో సమావేశం సందర్భంగా జియబావో ఈ వ్యాఖ్యలు చేశారు.
గత నెలలో విదేశాంగమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రబ్బానీ ఖర్ తొలిసారి చైనాలో పర్యటిస్తున్నారు. ఇరుదేశాల మధ్య స్నేహాన్ని బలోపేతం చేయడానికి తమ దేశంలో ఖర్ చేస్తున్న పర్యటన దోహదం చేస్తుందని వెన్ జియబావో అన్నారు. రెండు దేశాల మధ్య స్నేహం కాలపరీక్షకు నిలిచిందని ఆయన చెప్పారు. పాకిస్థాన్ ఆర్ధికవ్యవస్థ సుస్థిరంగా అభివృద్ధి చెందడం, వాణిజ్య సహకారం, పెట్టుబడి, సాంకేతికత విస్తరణకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.