పాకిస్థాన్ ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న తాలిబాన్ తీవ్రవాద గ్రూపులో చీలక వచ్చినట్లు తెలుస్తోంది. తాలిబాన్ తీవ్రవాద సంస్థకు చెందిన కొందరు కమాండర్లు తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) చీఫ్ బైతుల్లా మెహసూద్పై నిప్పులు చెరిగారు.
పాకిస్థాన్లో జరుగుతున్న అన్ని తీవ్రవాద దాడులకు బైతుల్లా మోహసూద్ కారణమని తాలిబాన్ కమాండర్ ఖారీ జైనుద్దీన్ మెహసూద్ ఆరోపించాడు. పాకిస్థాన్ గడ్డపై దాడులు జరిపేందుకు తాను వ్యతిరేకమని పేర్కొన్నాడు. ఇది ఇస్లాం వ్యతిరేకమని వ్యాఖ్యానించాడు.
పాకిస్థాన్కు చెందిన ఓ ప్రైవేట్ టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఖారీ జైనుద్దీన్ మెహసూద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ముస్లింయేతర విధానాలను వ్యతిరేకిస్తూ.. తనతోపాటు అనేక మంది ఇతర తీవ్రవాదులు టీటీపీ నుంచి పక్కకు వచ్చామని చెప్పాడు.
మేమందరం పాకిస్థాన్లో తీవ్రవాద దాడులు జరపడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపాడు. ఇదిలా ఉంటే టీటీపీ కమాండర్ హఫీజ్ సయీద్ టీవీ ఛానల్కు మెహసూద్ చెప్పిన విషయాలను తోసిపుచ్చాడు. ఖారీ జైనుద్దీన్ మెహసూద్ ఇప్పుడు తాలిబాన్ గ్రూపులో భాగం కాదని, అతను తమ తరపున మాట్లాడటానికి అనర్హుడని పేర్కొన్నాడు.
అతను టీటీపీతో పని చేయడం లేదన్నాడు. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాడని హఫీజ్ సయీద్ తెలిపాడు. ఇదిలా ఉంటే బైతుల్లా మెహసూద్ మాజీ సన్నిహితుడు ఖారీ తుర్కీస్థాన్ కూడా ఇస్లాంకు బైతుల్లా మెహసూద్ ప్రధాన శత్రువు అని పేర్కొన్నాడు.
పాకిస్థాన్ గడ్డపై మసీదులు, మదర్సాలపై బైతుల్లా మెహసూద్ నేతృత్వంలోని టీటీపీ తీవ్రవాద దాడులకు పాల్పడుతుండటంపై ఖారీ తుర్కీస్థాన్ మాట్లాడుతూ.. టీటీపీ చీఫ్కు అమెరికా, భారత్, ఇజ్రాయేల్ మద్దతు ఉందని ఆరోపించాడు.