జకార్తాలో గత నెల 17న రెండు లగ్జరీ హోటళ్లలో జరిగిన బాంబు పేలుళ్లతో ఆ హోటల్లో పూల అలంకరణ విభాగంలో పని చేసిన వ్యక్తికి ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. హోటల్లో ప్లోరిస్ట్గా పనిచేస్తున్న ఆండీ సుహాందితో అతని స్నేహితుడు ఇబ్రహీం ముహరం పూలాలంకరణ పని చేశాడు. బాంబు పేలుళ్లు జరిగిన రోజు తరువాత నుంచి ఇబ్రహీం కనిపించకుండా పోయాడు.
ఇండోనేషియా రాజధాని జకార్తాలో రెండు లగ్జరీ హోటళ్లలో జులై 17న బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఏడుగురు మృతి చెందారు. 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లపై పోలీసులు జరుపుతున్న దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా హోటల్లో పూలాలంకరణ విభాగంలో పని చేసిన వ్యక్తికి పేలుళ్లతో సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు.
పేలుళ్లు జరిగిన రోజు నుంచి ఆచూకీ తెలియకుండా పోయిన ఇబ్రహీం ముహరం అదే రోజున ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం కొన్ని రోజుల తరువాత బయటపడింది. స్నేహితుల వద్ద చాలా సౌమ్యుడిగా పేరు సంపాదించిన ఇబ్రహీంకు పేలుళ్లు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఇండోనేషియా మెస్ట్వాంటెడ్ తీవ్రవాది నూర్డిన్ ముహమ్మద్ టాప్కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇండోనేషియా పోలీసులు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇబ్రహీం ఇటీవల సెంట్రల్ జకార్తాలో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో మరణించాడు.
16 గంటలపాటు జరిగిన ఈ ఎన్కౌంటర్లో దొరికిన మృతదేహం మొదట నూర్డిన్ కావొచ్చని పోలీసులు భావించారు. అయితే డీఎన్ఏ పరీక్షల అనంతరం అది నూర్డిన్ మృతదేహం కాదని పోలీసులు నిర్ధారించుకున్నారు. మృతి చెందిన వ్యక్తిని ఇబ్రహీంగా పోలీసులు గుర్తించారు. దీంతో హోటల్ సిబ్బందిలో ఒకడిగా ఉన్న ఇబ్రహీంతో కలిసి ఈ పేలుళ్లకు నూర్డిన్ కుట్ర పన్నాడని పోలీసులు ఓ అభిప్రాయానికి వచ్చారు.