అట్లాంటిక్ మహాసముద్రంలో జూన్ 1న కూలిపోయిన ఎయిర్ ఫ్రాన్స్ విమాన శకలాల కోసం గాలింపు చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ విమానానికి చెందిన మరిన్ని శకాలలను బ్రెజిల్ మిలిటరీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో నుంచి పారిస్ వెళుతున్న ఎయిర్ ఫ్రాన్స్ జెట్ విమానం మార్గమధ్యంలో సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే.
ఈ విమాన ప్రమాదంలో 228 మంది ప్రాణాలు కోల్పోయారు. 2001 తరువాత ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఘోర విమాన ప్రమాదం ఇదే. ఇప్పటివరకు ప్రమాదంలో మృతి చెందిన 49 మంది భౌతికకాయాలను సహాయక సిబ్బంది గుర్తించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ విమానానికి సంబంధించిన మరిన్ని శకలాలు సముద్రంలో లభ్యమయ్యాయని బ్రెజిల్ మిలిటరీ అధికారులు తెలిపారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణంగా కూలిపోయిన విమానంలోని ప్రయాణికుల మృతదేహాలను, దాని శకలాలను వెలికితీసేందుకు కొన్ని రోజులపాటు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం వాతావరణం గాలింపు చర్యలకు అనుకూలిస్తోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. బ్రెజిల్, ఫ్రాన్స్ నౌకా దళాలు కూడా విమాన శకలాలు, బ్లాక్బాక్స్లు, ప్రయాణికుల మృతదేహాల గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి.