ఇరాన్ తాజాగా బయటపెట్టిన కొత్త యురేనియం శుద్ధి ప్లాంటు న్యాయబద్ధమైనదేనని ఆ దేశ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ సమర్థించుకున్నారు. ఇది పూర్తిగా న్యాయబద్ధమైన నిర్మాణమని తెలిపారు. పశ్చిమ దేశాలు ఇరాన్ రెండో యురేనియం శుద్ధి ప్లాంటు ఉన్న విషయాన్ని బయటపెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఇరాన్ తాజాగా తమ రెండో యురేనియం శుద్ధి ప్లాంటు వివరాలను అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ)కి తెలియజేసింది. ఇది పశ్చిమదేశాలను ఆందోళనకు గురి చేసింది. ఇప్పటికే ఇరాన్ వివాదాస్పద అణు కార్యక్రమంపై అగ్రదేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాజా పరిణామం వాటిని మరింత ఆగ్రహానికి గురి చేసింది.
ఈ నేపథ్యంలో.. అహ్మదీనెజాద్ మాట్లాడుతూ తమ అణు కార్యక్రమంపై, కొత్త ప్లాంటుపై పశ్చిమ దేశాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్లాంటు ఉన్న విషయాన్ని మేము ఐఏఈఏకి తెలియజేశాము. దీనికి తమను ప్రోత్సహించాలన్నారు. ఇది పూర్తిగా న్యాయబద్ధమైందని వివరించారు.
ఇప్పటికే వివాదాస్పద అణు కార్యక్రమం విషయంలో ఇరాన్- పశ్చిమ దేశాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో.. తాజా వెల్లడి తమను మరింత ఇరుకునపెట్టిందని తాను భావించడం లేదన్నారు. అక్టోబరు- 1న జెనీవాలో ఐఏఈఏతో జరిగే చర్చలపై తాము ఆశాభావంతో ఉన్నామన్నారు. అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాలను తాము ఐఏఈఏతోనే పంచుకుంటామన్నారు. దీనిని ప్రపంచ దేశాలతో పంచుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఇరాన్ తాజాగా వెల్లడించిన రెండో యురేనియం శుద్ధి ప్లాంటు ఆ దేశ రాజధాని టెహ్రాన్కు దక్షిణ దిశగా వంద మైళ్ల దూరంలో ఉన్న ఖోమ్లో ఉంది. రెండో ప్లాంటుపై అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు ఇప్పటికే ఇరాన్పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగాయి. దీనికి సంబంధించిన వివరాలన్నీ డిసెంబరులోగా తెలియజేయాలని, లేకుండా కఠిన ఆంక్షలు తప్పవని అల్టిమేటం జారీ చేశాయి.