ఇరాన్లో వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసాకాండను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖండించారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఇరాన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణలు, నిర్బంధాలపై అమెరికా, అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతుందన్నారు.
అయితే ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. ఇరాన్లో తాజా పరిణామాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇరాన్లో జరుగుతున్న హింసాకాండలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతుండటంపై విచారం వ్యక్తం చేశారు.
ఇరాన్ సార్వభౌమత్వాన్ని తాము గౌరవిస్తున్నామని చెప్పారు. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోదన్నారు. ప్రపంచంలో అమాయక పౌరులు ఎక్కడ హింసించబడినా తాము దానిని ఖండిస్తామని బరాక్ ఒబామా మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు.