ఆఫ్ఘనిస్థాన్లో ఈ నెల 20న జరగబోతున్న అధ్యక్ష ఎన్నికలను తాము లక్ష్యంగా చేసుకుంటామని తాలిబాన్లు ఆదివారం తొలిసారి ప్రకటించారు. పోలింగ్ కేంద్రాలపై నేరుగా దాడులు చేస్తామని తాలిబాన్లు హెచ్చరికలు జారీ చేయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఈ ఎన్నికలను బాయ్కాట్ చేయాలని తాలిబాన్లు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలపై విధ్వంసక చర్యలకు పాల్పడతామని తాలిబాన్ ప్రతినిధులు ప్రకటించారు. దక్షిణ ఆఫ్ఘనిస్థాన్లోని గ్రామాల్లో ఈ హెచ్చరిక పత్రాలను తాలిబాన్లు అంటించారు.
ఇదిలా ఉంటే ముందురోజు తాలిబాన్ తీవ్రవాదులు దేశ రాజధాని కాబూల్లోని నాటో ప్రధాన కార్యాలయం వెలుపల ఆత్మాహుతి దాడి చేసిన సంగతి తెలిసిందే. దక్షిణ ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ తీవ్రవాదులు ఇప్పటికీ గట్టిపట్టు కలిగివున్నారు. ఈ నేపథ్యంలో.. చారిత్రాత్మక అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండటం ఆఫ్ఘన్ పౌరులను ఆందోళనకు గురి చేస్తోంది.