ఆఫ్ఘనిస్థాన్ కళంకిత మిలిటరీ నేతల్లో ఒకరైన జనరల్ అభ్దుల్ రషీద్ దోస్తూమ్ ఆ దేశ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్కు మద్దతుగా నిలిచారు. ఈ నెల 20న ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. ఎన్నికల ముగింపు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కర్జాయ్తో కలిసి దోస్తూమ్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే దేశంలో గురువారం జరిగే ఎన్నికల సందర్భంగా హింసాకాండ సృష్టిస్తామని తాలిబాన్ తీవ్రవాదులు ఇప్పటికే హెచ్చరించారు. తాలిబాన్లు ఈ ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పోలింగ్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని తాలిబాన్ ప్రతినిధులు ఇటీవల బెదిరించారు.
పాత మిలిటరీ చీఫ్లు కూడా ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు. తాలిబాన్లు, పాత మిలిటరీ చీఫ్ల నుంచి ముప్పు ఎదుర్కొంటున్న ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తిరిగి గెలుపొందడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కర్జాయ్కు ఈ ఎన్నికల్లో అబ్దుల్లా అబ్దుల్లా నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. కర్జాయ్కు ప్రధాన ప్రత్యర్థిగా అబ్దుల్లానే ఉన్నారు.
వీరిరువురూ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం ముగింపు సందర్భంగా సోమవారం ఇద్దరు నేతలు వేర్పేరు ప్రాంతాల్లో జరిగిన భారీ ర్యాలీల్లో ప్రసంగించారు. టర్కీ నుంచి ఆదివారం ఆఫ్ఘనిస్థాన్ తిరిగి వచ్చిన మాజీ ఉజ్బెక్ మిలిటరీ చీఫ్ జనరల్ అబ్దుల్ రషీద్ దోస్తూమ్ షిబెర్ఘాన్ (దోస్తూమ్ సొంత నగరం)లో వేలాది మంది తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనం కర్జాయ్తో కలిసి ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.
ఎన్నికలకు సంబంధించిన జరిగిన సర్వేలు మాత్రం కర్జాయ్కు స్పష్టమైన ఆధిక్యత వస్తుందని చెబుతున్నాయి. కర్జాయ్కు 45 శాతం ఓట్లు వస్తాయని సర్వేలు వెల్లడించాయి. అయితే సంపూర్ణ మెజారిటీ సాధించేందుకు కర్జాయ్కు ఈ ఓట్లు సరిపోవు. కర్జాయ్ మంత్రివర్గంలో గతంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన అబ్దుల్లా ఇప్పుడు ఆయన ప్రధాన ప్రత్యర్థి అయ్యారు.
అబ్దుల్లా అబ్దుల్లాకు ఉత్తర ఆఫ్ఘనిస్థాన్లో మెజారిటీ తెగ అయిన తాజిక్స్లో గట్టిపట్టుంది. దోస్తూమ్ కూడా ఇదే ప్రాంతానికి చెందినవాడు కావడంతోపాటు, అతనికి ఈ ప్రాంతంలో ఉన్న విశేష ఆదరణను దృష్టిలో ఉంచుకొనే కర్జాయ్ వ్యూహాత్మకంగా ఈ కళంకిత మిలిటరీ చీఫ్ను తనవైపు తిప్పుకున్నట్లు తెలుస్తోంది.