Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆఫ్ఘన్ ఎన్నికలు: ఓటు వేసిన హమీద్ కర్జాయ్

Advertiesment
ఆఫ్ఘనిస్థాన్
ఆఫ్ఘనిస్థాన్‌లో గురువారం చారిత్రాత్మక అధ్యక్ష, ప్రావీన్స్ మండలుల ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల కోసం అధికారిక యంత్రాంగం దేశవ్యాప్తంగా 7000 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇందులో 700 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సుమారు 17 మిలియన్ల మంది ఆఫ్ఘన్ పౌరులు ఈ రోజు ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు.

సాయుధ తీవ్రవాదం, మాదకద్రవ్యాలు, అవినీతిలో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘనిస్థాన్‌లో సుస్థిరతకు కీలకమైన ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అబ్దుల్లా ప్రధాన ప్రత్యర్థులు. గురువారం ఉదయం ఆఫ్ఘన్‌లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఇప్పటికే ఓటు వేశారు.

ఆప్ఘనిస్థాన్‌లో ప్రజాస్వామ్య పద్దతిలో రెండోసారి జరుగుతున్న ఈ ఎన్నికలు విజయవంతం కావడం దేశంలోని సమస్యాత్మక దక్షిణ ప్రాంతంలోని ఓటర్లపైనే ఆధారపడి ఉంది. ఈ ప్రాంతంలో తాలిబాన్లకు పట్టు ఉండటం పౌరులను కలవరపెడుతోంది. ఇప్పటికే తాలిబాన్ తీవ్రవాదులు ఈ ఎన్నికలకు ఆటంకం కలిగిస్తామని హెచ్చరించారు. వీటిని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే గత ఐదు రోజులుగా మూడుసార్లు తాలిబాన్ తీవ్రవాదులు దాడులు చేయడంతో.. దేశ రాజధాని కాబూల్‌లో అధికారిక యంత్రాంగం పటిష్ట భద్రత కల్పించింది. హెలికాఫ్టర్ల పహారాలో రాజధానిలో పోలింగ్ జరుగుతోంది. అంతేకాకుండా అధికారిక యంత్రాంగం ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో చెక్‌పాయింట్లను ఏర్పాటు చేసింది.

ఆఫ్ఘనిస్థాన్ తాజా అధ్యక్ష ఎన్నికల్లో 36 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో ప్రస్తుత అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌కే భారీగా ఓట్లు పడే అవకాశం ఉంది. దేశంలో తాలిబాన్ శకం ముగిసిన తరువాత ఎనిమిదేళ్లపాటు కర్జాయ్ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కర్జాయ్‌కు తన వర్గానికే చెందిన అబ్దుల్లా అబ్దుల్లా నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది.

తాజా ఎన్నికల్లో కర్జాయ్ పూర్తిస్థాయిలో మెజారిటీ సాధించడం కష్టసాధ్యమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆఫ్ఘన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు పొందిన వ్యక్తే విజేతగా నిలుస్తారు.

అయితే కర్జాయ్‌కు తాజా ఎన్నికల్లో 50 శాతం ఓట్లు రావడం కష్టమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పోటీ చేసిన అభ్యర్థులెవరికీ 50 శాతం ఓట్లు రాకుంటే, తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు మళ్లీ ఓటింగ్ నిర్వహిస్తారు. తాజా ఎన్నికల ప్రాథమిక ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu