ఆఫ్ఘనిస్థాన్లో సైనికులను లక్ష్యంగా చేసుకొని సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కాందహార్ ప్రావీన్స్లో ఈ దాడి జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. దాడిలో మరో ఐదుగురు సైనికులు, ఇద్దరు పాదచారులు గాయపడ్డారు.
ఈ దాడికి తాలిబాన్ తీవ్రవాదులు బాధ్యత వహించారు. తాలిబాన్ ప్రతినిధి ఒకరు గుర్తు తెలియని ప్రదేశం నుంచి టెలిఫోన్లో ఈ విషయాన్ని తెలియజేశాడు. ఆఫ్ఘనిస్థాన్లో ప్రపంచదేశాలు దళాల సంఖ్యను పెంచుతూ తాలిబాన్లతో పోరాడుతున్నప్పటికీ, హింసాకాండను నియంత్రించలేకపోతున్నాయి. తాలిబాన్ల చెర నుంచి కాబూల్ను 2001లో విదేశీ సేనలు విడిపించాయి.
అప్పటి నుంచి ఈ దేశంలో అమెరికా నేతృత్వంలో నాటో సేనలు తాలిబాన్ తీవ్రవాదులతో పోరాడుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో 32 వేల మంది అమెరికా సైనికులు, మరో 30 వేల మంది పశ్చిమదేశాల సేనలు ఉన్నాయి. ఈ ఏడాది చివరినాటికి ఆఫ్ఘనిస్థాన్లో తమ సైనికుల సంఖ్యను 68 వేలకు చేర్చేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది.