తమ స్థావరాలపై అమెరికా, పాకిస్థాన్లు నిరంతరాయంగా కొనసాగిస్తున్న దాడులకు ప్రతీకార చర్య తప్పదని పాక్ తాలిబన్ కొత్త అధినేత హకీముల్లా మెహసూద్ హెచ్చరించాడు. అమెరికా సేనలు జరిపిన ద్రోన్ దాడుల్లో బైతుల్లా మహసూద్తో పాటు హకీముల్లా కూడా మృతి చెందివుంటాడని భావిస్తున్న తరుణంలో హకీముల్లా మీడియా ముందు ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్య పరిచాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బైతుల్లా మరణానికి, తమపై సాగుతున్న ద్రోన్ దాడులకు, పాక్ చేస్తున్న సహాయానికి ప్రతీకారం తీర్చుకునే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించాడు. దక్షిణ వర్జిస్థాన్లోని సరారోఘా వద్ద మీడియాతో హకీముల్లా సమావేశమైనట్టు పాక్కు చెందిన డాన్ వార్తా పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ సమావేశంలో తాలిబన్ కమాండర్లు ఖరీ హుస్సేన్, రెహ్మాన్లు కూడా పాల్గొన్నట్టు ఆ పత్రిక తెలిపింది.