Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అణ్వాయుధాల కొనుగోలుకు ఎల్టీటీఈ ప్రయత్నం

Advertiesment
ఎల్టీటీఈ
శ్రీలంకలో ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేస్తూ సుమారు 30 ఏళ్లపాటు జరిగిన పౌర యుద్ధానికి నేతృత్వం వహించిన ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ ఒకానొక దశలో అణ్వాయుధాలు కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఎల్టీటీఈ కొత్త చీఫ్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కుమరన్ పధ్మనాథన్ ఇటీవల థాయ్‌లాండ్‌లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఆయన ప్రస్తుతం శ్రీలంక అధికారిక యంత్రాంగం కస్టడీలో ఉన్నారు. ఎల్టీటీఈ శ్రీలంక ఆర్మీపై ప్రయోగించేందుకు ఒక దశలో అణ్వాయుధాలు కొనుగోలుకు కూడా ప్రయత్నించిందని కుమరన్ పధ్మనాథన్ విచారణలో వెల్లడించాడు. పశ్చిమ దేశాల నుంచి అణ్వాయుధాలను, దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేసేందుకు ఎల్టీటీఈ ప్రయత్నించిందని తెలియడం శ్రీలంక అధికారిక యంత్రాంగాన్ని ఆశ్చర్యపరిచింది.

ఈ సంచనాత్మక విషయాన్ని పధ్మనాథన్ దర్యాప్తు సంస్థలకు వెల్లడించినట్లు శ్రీలంకకు చెందిన ఓ జాతీయ దినపత్రిక తెలిపింది. అణ్వాయుధాలు సమకూర్చుకునేందుకు ప్రయత్నించిన తొలి తీవ్రవాద సంస్థ కూడా ఎల్టీటీఈనే అని పేర్కొంది. ఎల్టీటీఈ ఈ దిశగా చేసిన ప్రయత్నాలు విజయవంతమయివుంటే అణ్వాయుధాలు మిగిలిన తీవ్రవాద సంస్థల చేతుల్లోకి కూడా వెళ్లేవని ఆందోళన వ్యక్తం చేసింది.

కుమరన్ పధ్మనాథన్ ఎల్టీటీఈ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టకముందు ఎల్టీటీఈ అంతర్జాతీయ విభాగాధిపతిగా పని చేశాడు. విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి, ఎల్టీటీఈకి అందజేయడం ఈ విభాగం ముఖ్యమైన పని. అమెరికాలోని ఆయుధ వ్యాపారుల నుంచి ఏ విధంగా ఆయుధాలు కొనుగోలు చేసి, శ్రీలంకకు తరలించేవారో కుమరన్ పధ్మనాథన్ విచారణలో వెల్లడించినట్లు శ్రీలంక పత్రిక పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu