ప్రపంచంలో తొలి అణు బాంబు దాడికి, అది సృష్టించిన మారణకాండకు సజీవసాక్ష్యంగా మిగిలిన నగరం హిరోషిమా. జపాన్లోని హిరోషిమా, తరువాత నాగసాకి నగరాలపై అమెరికా 1945లో రెండో ప్రపంచయుద్ధం సందర్భంగా వేసిన అణు బాంబులు వేలాది పౌరుల ప్రాణాలను బలిగొన్నాయి. హిరోషిమాపై అమెరికా అణు బాంబు వేసి నేటికి 64 ఏళ్లు పూర్తయ్యాయి.
హిరోషిమా నగరంలో అణు దాడి మృతులకు నివాళులు అర్పించేందుకు బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే దశాబ్దంలోగా అణ్వస్త్రరహిత ప్రపంచం కోసం హిరోషిమా మేయర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అణు బాంబు దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన పౌరులతోపాటు, సుమారు 50 వేల మంది మృతుల స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించారు.
జపాన్ ప్రధానమంత్రి తారో అసో, 50 దేశాల ప్రతినిధులు స్మారక చిహ్నం వద్ద అణు బాంబు దాడి మృతులకు నివాళులు అర్పించారు. హిరోషిమా మేయర్ తడతోషి అకిబా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అణ్వాయుధరహిత ప్రపంచంపై ఉన్న అభిప్రాయాలను సమర్థించారు.
ఈ విషయంలో ఒబామాకు తాను మద్దతిస్తానన్నారు. ప్రపంచంలో అణ్వాయుధాన్ని యుద్ధంలో ఉపయోగించిన దేశం అమెరికానేనని, అందువలన అణ్వస్త్రరహిత ప్రపంచాన్ని సాకారం చేసేందుకు చర్యలు చేపట్టాల్సిన నైతిక బాధ్యత కూడా అమెరికాకు ఉందని ఒబామా ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలను హిరోషిమా మేయర్ గుర్తు చేశారు.