పల్లెటూళ్లలో బొప్పాయి చెట్టులేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. పోషక విలువలపరంగా చూసినా కూడా బొప్పాయిది అగ్రస్థానమే. అయితే పండిన తరువాతే ఎక్కువమంది దీన్ని తినేందుకు ఇష్టపడతారు. కానీ పచ్చికాయలతో కూడా రకరకాల రుచికరమైన కూరలను తయారు చేసుకోవచ్చు. అలాంటి వాటిలో ఒకటి ఈ బొప్పాయి పులుసు కూర.
కావలసిన పదార్థాలు :
కొద్దిగా పండిన బొప్పాయి.. సగం ముక్క
మునక్కాయ... ఒకటి
బెండకాయలు... మూడు
బచ్చలి ఆకులు... ఎనిమిది
కొత్తిమీర... ఒక కట్ట
పచ్చిమిర్చి... నాలుగు
బెల్లం... నిమ్మకాయంత
చింతపండురసం... రెండు కప్పులు
ఉప్పు... తగినంత
పసుపు... చిటికెడు
బియ్యంపిండి లేదా శెనగపిండి... రెండు టీ.
ఆవాలు, మెంతులు...రెండు టీ.
ఎండుమిర్చి.. రెండు
కరివేపాకు... రెండు రెమ్మలు
నూనె... తగినంత
తయారీ విధానం :
బొప్పాయి చెక్కు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కోయాలి. బెండకాయలు, మునక్కాయ కూడా ముక్కలుగా కోసుకోవాలి. బచ్చలి ఆకు, పచ్చిమిర్చిలను సన్నగా తరుక్కోవాలి. వీటన్నింటినీ ఓ గిన్నెలో వేసి ముక్కలు మునిగేంతదాకా నీటినిపోసి, తగినంత ఉప్పు, పసుపు వేసి కాసేపు ఉడికించాలి.
తరువాత అందులోనే చింతపండు రసం, బెల్లం కూడా వేసి మరికాసేపు ఉడికించాలి. ముక్కలు ఉడికిన తరువాత అరకప్పు నీటిలో శెనగపిండి లేదా బియ్యంపిండిని ఉండలు కట్టకుండా కలిపి పులుసులో వేయాలి. పిండి పోసిన తరువాత మరో ఐదు నిమిషాలపాటు ఉడికించి దించేముందు సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరను చల్లాలి.
చివర్లో ఆవాలు, మెంతులు, నూనె, కరివేపాకులతో తాలింపు వేయాలి. అంతే బొప్పాయి పులుసు కూర రెడీ అయినట్లే...! ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. మీరూ ప్రయత్నించి చూడండి మరి...!