హెచ్ఐవీ/ఎయిడ్స్ వైరస్ను నిర్మూలించే హోమియో మూలకాన్ని కనుగొన్నట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి డైరక్టర్ జనరల్ డా. ఎన్.కె.గంగూలీ ప్రకటించారు. జాతీయ ఎయిడ్స్ పరిశోధనా సంస్థ (ఎన్ఏఆర్ఐ)లో చేపట్టిన పరిశోధనలో హోమియో మూలకం పనితీరు వెలికివచ్చిందని గంగూలీ తెలిపారు.
ఎన్ఏఆర్ఐలో నిర్వహించిన హోమియోపతి మూలకం పరీక్ష సందర్భంగా, సంబంధిత మూలకం ఎయిడ్స్ వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనడాన్ని కనుగొన్నామని వెల్లడించారు. మేథోపరమైన హక్కులకు సంబంధించినందున హోమియోపతి మూలకం పేరును వెల్లడించడానికి డా.గంగూలీ నిరాకరించారు.
మూలకాన్ని అందించిన కంపెనీతో పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఆ మూలకం కొన్ని రకాల వ్యాధుల నివారణకు వాడకంలో ఉన్నట్లు పేర్కొన్నారు. హోమియోపతి మూలకాన్ని మానవులపై పరీక్షించిన అనంతరం వెలువడే ఫలితాలను అనుసరించి వాణిజ్యపరంగా విడుదల చేస్తామని డా.గంగూలీ తెలిపారు.
హోమియోపతి ఔషధాల వాడకంలో సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తే అవకాశం ఉండదు కనుక త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.