తిరుమలలో వివిధ విభాగాలలో భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులకు శిక్షణ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచాలని తితిదే తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీకె.ఎస్.శ్రీనివాసరాజు ఆధికారులను కోరారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం వివిధ విభాగాల అధికారులతో జెఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈ వేసవిలో ఎక్కువ సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారని, వారికి శ్రీవారి సేవకుల సేవలు ఎంతో అవసరమని అన్నారు.
అందుకుతగ్గట్టు శ్రీవారి సేవకులు భక్తులతో మెలిగే విధానం, భక్తి, సహనభావం పెంపొందేలా ప్రతి విభాగంలోని అధికారులు తగిన సూచనలు తప్పనిసరిగా చేయాలన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ -1, 2, ఇతర ప్రాంతాల్లో వృథాగా ఉన్న కుర్చీలు, బల్లలు తదితర సామగ్రిని వెంటనే తొలగించాలని సూచించారు. వేసవి కావడంతో తాగునీటి కోసం వచ్చే జంతువులకు అందుబాటులో ఉండేలా ఘాట్ రోడ్డు వెంబడి నీటితొట్టెలను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు నీటిని నింపాల్సిన అవసరముందని అటవీ అధికారులను కోరారు.
వేసవిలో భక్తులకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులను అవసరమైనంత స్టాక్ ఉంచుకోవాలని వైద్యాధికారిని ఆదేశించారు. తిరుమలలోని వంట చెరుకు డిపోను రింగ్ రోడ్డు ప్రాంతానికి మార్పు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వర్షం కురిసినపుడు ఎటిసి ప్రాంతంలో ఎక్కువగా వర్షపునీరు నిల్వ ఉంటోందని, భక్తులకు ఇబ్బంది లేకుండా సత్వరం తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు.