Publish Date: Sat, 29 Aug 2015 (08:02 IST)
Updated Date: Sat, 29 Aug 2015 (08:11 IST)
తిరుపతి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులే కాకుండా తాము కూడా ఆ బాధ్యతలను తీసుకుంటామని ఆయన చెప్పారు. తిరుమల తరహాలో తిరుపతిని తీర్చిదిద్దుతామని, స్మార్టుకు మరింత వన్నె తెస్తామని చెప్పారు. సుందరీకరణ పనులు, ఆధ్యాత్మిక మార్గదర్శక నగరంగా చేపతామని చెప్పారు.
తిరుపతి పద్మావతి అతిథిగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల, తిరుపతిలలో నీటికొరత లేకుండా చూడటానికి గాలేరు-నగరి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఆమోదం పొందాయన్నారు. తిరుపతిలోని రోడ్ల నిర్మాణాలకు, అభివృద్ధికి తితిదే తరఫున మొదటి విడతగా రూ.10 కోట్లు విడుదల చేశామన్నారు. తిరుపతి నగరం సుందరీకరణలో భాగంగా డ్రైనేజీ వ్యవస్థ, ఉద్యానవనాలను పెంపొందిస్తామన్నారు. ఇక కపిల తీర్థం పై భాగంలో ఓ రిజర్వాయర్ను నిర్మించి తాగునీటి అవసరాలను తీర్చుతామని చెప్పారు.
తిరుపతి సమీపంలోని వకులమాత ఆలయంతోపాటు నగరంలో ఉన్న వివిధ దేవాలయాల్లో నిత్య, దీపధూప, నైవేద్యాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించేలా తితిదే చర్యలు పడుతోందని వివరించారు. తిరుపతి నగరానికి విచ్చేసే భక్తులకు తిరుమలలో ఉండే అనుభూతి పొందేందుకు తితిదే చేస్తున్న అభివృద్ధి పనులకు స్థానికులు చేయూతనందించాల్సిన అవసరం ఉందన్నారు.