ప్రస్తుతం చాలామంది కంప్యూటర్ ముందు కూర్చుని దాదాపు ఎనిమిది నుంచి పది గంటలవరకు పని చేస్తున్నారు. ఇది నిత్యకృత్యం అయిపోతోంది. దీంతో మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి రెండూ పెరిగి పోతున్నాయి. వెంటనే రాత్రి అయ్యేటప్పటికి అలసటకు గురౌతుంటారు.
కంప్యూటర్ ముందు కూర్చుని తదేకంగా చూస్తూ ఉండటం మూలాన కళ్ళకు శ్రమ ఎక్కువ కలుగుతోంది. అలాగే కొన్ని కానరాని సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంది.
నష్టాలు: కంప్యూటర్తో ఎక్కువ సేపు పనిచేసేవారిలో జ్ఞాపకశక్తి లోపించడం, దూరదృష్టి లోపం, చిరాకు పడటం, వెన్నునొప్పి, అనవసరమైన అలసట మొదలైనవి ఏర్పడతాయి. కంప్యూటర్తో పని చేయడం అధికంగా ఉంటే మస్తిష్కంతోబాటు కళ్ళు కూడా బాగా అలసిపోతాయి. దీంతో నిద్రతో ఉపశమనం కలుగుతుందనుకుంటే పొరబాటే.
అత్యధిక సమయం కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసేవారిలో దృష్టి లోపం ఏర్పడినట్లు వైద్యులు చెబుతున్నారు. అలాంటివారు కళ్ళజోడును ఎక్కువగా ధరిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఇదికాకుండా జ్ఞాపకశక్తి కూడా కోల్పోతున్నట్లు వారి పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు తెలిపారు.
పని ఒత్తిడి కారణంగా వారిలో చిరాకు పాళ్ళు అధికంగా ఏర్పుడుతుంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారు కార్యాలయంలోని కొపాన్నంతటిని ఇంట్లోని వారిపై చూపుతుంటారని వారు పేర్కొన్నారు. సహజంగా కంప్యూటర్తో ఎక్కువ సమయం గడిపేవారిలో ఇలాంటి బాధలు ఉత్పన్నమౌతాయని వారంటున్నారు.
జాగ్రత్తలు పాటించండిలా...!
ముందుగా మీ కంప్యూటర్ను మీ కళ్ళకు సమాంతరంగా ఉంచుకోండి. దీంతో మీ కళ్ళకు శ్రమ తగ్గించినవారవుతారు. ముఖ్యంగా మీ కంప్యూటర్ను మీరు కూర్చునే స్థానం నుంచి కనీసం రెండు అడుగుల నుండి మూడు అడుగుల దూరంలో ఉంచండి. మరో విషయం ఏంటంటే కంప్యూటర్తో నిరంతరం పని చేస్తుంటే మధ్య మధ్యలో కనీసం 5 నుంచి 10 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో దృష్టిని మరల్చండి. దీంతో దూర దృష్టి లోపం రాదంటున్నారు వైద్యులు.
మీ జ్ఞాపక శక్తిని కాపాడుకోవాలనుకుంటే పగలంతా మీరు చేసిన పనిని రాత్రివేళ తిరగదోడండి. అలా ఆలోచిస్తూ నిద్రకుపక్రమించండి. మీరు ఏదైతే ఆహారంగా తీసుకున్నారో దానిని ఒక్కసారి స్మరించుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలసటను దూరం చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా ధ్యానం, యోగనిద్రను అలవాటు చేసుకోండి.
యోగా ఎక్సర్సైజ్ : ముఖ్యంగా కంప్యూటర్ ముందు కూర్చుని తదేకంగా పని చేసేవారు కనుగుడ్లను రెండుమూడు సార్లు పైకి, క్రిందకు గుండ్రంగా తిప్పండి. దీంతో కళ్ళకు చెందిన కండరాలకు శక్తి వస్తుంది.
వెన్ను నొప్పితో బాధపడుతుంటే మీ రెండు మోచేతులను కలుపుతూ శ్వాసను పూర్తిగా పీల్చుకుని రెండు సార్లు వదలండి. ఆ తర్వాత రెండు చేతుల వేళ్ళను మీ భుజాలపై ఉంచండి. మళ్ళీ రెండు మోచేతులను ముందుకు వెనుకకు తిప్పండి. ఇలా 5 నుంచి 6 సార్లు చేయండి. దీంతో వెన్ను నొప్పి మటుమాయమౌతుందంటున్నారు వైద్యులు.
మెడను రెండువైపులా తిప్పండి. అలాగే ముందు-వెనుకకు తిప్పండి. ఆ తర్వాత మెడను గుండ్రంగా అంటే ఎడమవైపునుంచి కుడివైపుకు, కుడి వైపునుంచి ఎడమవైపుకు తిప్పండి. ఇలా చేస్తున్నప్పుడు మీ శ్వాసమీద దృష్టి పెట్టండి.
మీరు చేయవలసిన యోగాసనాలలో ముఖ్యంగా తాడాసనం, అర్ధ-మత్స్యేంద్రాసనం, నౌకాసనం, అలాగే విపరీత నౌకాసనం. ప్రాణాయామంలో నాడీ మండలంపై ప్రత్యేక దృష్టిని సారించండి. ఆ తర్వాత శవాసనంలో యోగ నిద్రలోకి జారుకోండి. దీర్ఘంగా శ్వాస పీల్చండి. వదలండి. ఇలా చేస్తుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో మీరు చలాకీగా ఉండగలరని యోగా నిపుణులు అంటున్నారు.