ప్రపంచంలో కేన్సర్ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్యను చూసినప్పుడు, ప్రతి 13వ కొత్త కేన్సర్ కేసు భారతదేశం నుంచి నమోదవుతోందని అమెరికాకు చెందిన డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించింది. కేన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య భారతదేశంలో క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపింది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ తెలిపింది.
ఇందుకుగాను అక్టోబరు 12-13 తేదీల్లో నోయిడాలో వర్క్ షాపులను నిర్వహించనున్నట్లు ఎన్సీఐ తెలియజేసింది. ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రీత మాట్లాడుతూ... ప్రతి 13వ కేన్సర్ కేసు భారతదేశానికి చెందినదిగా నమోదవుతుందని చెప్పారు. ఐతే మీడియా ప్రభంజనం ఎక్కువగా ఉన్న భారతదేశంలో ఈ వ్యాధిని నియంత్రించడం కష్టసాధ్యమైనదేమీ కాదని ఆమె పేర్కొన్నారు. భారతదేశంలో సుమారు 1.8 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోందని చెప్పారు. ఈ కేసుల్లోనూ ముఖ్యంగా బ్రెస్ట్ కేన్సర్, సర్వికల్ కేన్సర్, ఓరల్ కేన్సర్ అగ్రభాగాన ఉంటున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే నయం చేయడం సాధ్యమేనని చెప్పారు.