Publish Date: Wed, 03 Apr 2019 (17:32 IST)
Updated Date: Wed, 03 Apr 2019 (17:33 IST)
మనం స్నాక్స్గా తీసుకునే ధాన్యాలలో మొక్కజొన్న కూడా ఒకటి, దీనిని కూరలు, గ్రేవీల తయారీలో కూడా వినియోగిస్తారు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటి వాటితో కూడా చేర్చి స్నాక్స్గా తీసుకుంటే మంచి మజాగా ఉంటుంది. మొక్కజొన్న పొత్తులను సాధారణంగా నిప్పులపై కాల్చి వేడివేడిగా తింటుంటారు. ఇది రుచిగా ఉండటమే కాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
మొక్కజొన్నలో ఫ్లేవనాయిడ్స్ అని పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీని కారణంగా క్యాన్సర్లు రావు. మెుక్కజొన్నలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ, విటమిన్ సి ఉండడం వలన చర్మ సంబంధ సమస్యలు పోతాయి. జింక్, పాస్పరస్, మెగ్నిషియం, ఐరన్లు, ఇతర మినరల్స్ మొక్కజొన్నలో ఉన్నాయి.
ఇవి ఎముకలను పటిష్టంగా ఉంచడంలో సహాయపడతాయి. కీళ్లనొప్పులతో బాధపడేవారు మొక్కజొన్నలను ఆహారంలో భాగం చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. మొక్కజొన్నల్లో పుష్కలంగా ఉన్న ఐరన్ వల్ల రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు. మొక్కజొన్నల్లో ఉండే అధిక పీచు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
పేగు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మొక్కజొన్న గింజల్లో ఉండే లవణాలు, విటమిన్స్ ఇన్సులిన్పై ప్రభావం చూపిస్తాయి. మధుమేహం ఉన్నవారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండడం వలన మొక్క జొన్న గర్భిణీ మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది. వారి కడుపులోని బిడ్డకు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవసరం. కాబట్టి మొక్కజొన్నలను గర్భిణీలు తింటే పుట్టబోయే పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.