కంప్యూటర్ విజన్ సిండ్రోమ్.... నాక్కూడా వుందేమో...?! తెలుసుకునేదెలా..?!!
అవును... ఇప్పుడు ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ నాక్కూడా ఉండే వుంటుందేమో అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంప్యూటర్, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ లేదా టీవీ... ఈ నాలుగింటిలో ఏదో ఒక సాధనంతో పొద్దస్తమానం కాలం గడిపేస్తుంటే... ఇక డౌటే లేదు కంప్యూటర్ విజన్ స
Publish Date: Fri, 03 Jun 2016 (16:50 IST)
Updated Date: Fri, 03 Jun 2016 (16:53 IST)
అవును... ఇప్పుడు ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ నాక్కూడా ఉండే వుంటుందేమో అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంప్యూటర్, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ లేదా టీవీ... ఈ నాలుగింటిలో ఏదో ఒక సాధనంతో పొద్దస్తమానం కాలం గడిపేస్తుంటే... ఇక డౌటే లేదు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఉన్నట్లే. ఈ రకం అలవాటుతో ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో 70 నుంచి 90 శాతం సతమతమవుతున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
డిజిటల్ వరల్డ్ పుణ్యమా అంటూ ఇప్పుడు కంప్యూటర్లు, ల్యాప్ టాపులు, ట్యాబులు, మొబైల్ ఫోన్లు, టీవీలు ఇలా అనేక సాధనాల్లో మనక్కావాల్సిన సమాచారం దొరుకుతుంది. దీనితో వాటితోటిదే లోకం అన్నట్లు చాలామంది గడిపేస్తున్నారు. ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో 7 కోట్ల మందికి పైగా ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ బారిన పడినట్లు చెపుతున్నారు. దీని ప్రభావం ఏంటయా అంటే... పొద్దస్తమానం ఆ సాధనాల ముందు తప్ప ఇక వారు ఎక్కడా ఎక్కువగా కనిపించరు. దీనితో అతి పిన్నవయసులోనే కంటిచూపు మందగించి తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు. ఇది చాలా తీవ్రమైన అనారోగ్య సమస్య అని వైద్యులు చెపుతున్నారు.
ఈ సిండ్రోమ్ ఏం చేస్తుంది...?
కంప్యూటరుతో పనిచేసేటపుడు, మొబైల్ గేమ్స్ ఆడేటపుడు, టీవీ చూస్తున్నప్పుడు కంటి రెప్పలను ఆర్పకుండా చూడటం ఎక్కవవుతుంది. సహజంగా అయితే నిమిషానికి కనీసం మూడు నుంచి నాలుగుసార్లు కంటి రెప్పలను మూసితెరవడం జరుగుతుంది. కంప్యూటర్ వర్క్ చేసేవారిలో ఇది జరుగదు. దీనితో కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. కంటికి సమస్య అధికం చేయడం కారణంగా కంటిచూపు మందగించడం జరుగుతుంది.
సమస్య అధికమయ్యిందని గుర్తించడమెలా...?
పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం... డిజిటల్ స్క్రీన్లను అదేపనిగా ఉపయోగించడం వల్ల కళ్లకు పలు సమస్యలను కలిగిస్తాయి. ఒక చిత్రం రెండుగా కనబడటం, బ్లర్ గా కనిపించడం, కళ్లు మండుతున్నట్లు అనిపించడం, కళ్లలో దురద, మంట, ఎండిపోయినట్లుగా అనిపించడం, ఎర్రబారటం వంటివన్నీ ఈ సమస్య కిందికే వస్తాయి. కంటితోనే వదలకపోవచ్చు. తలనొప్పి, మెడ నొప్పి, వెన్నునొప్పి, మానసికంగా ఒత్తిడి వంటివి కూడా వెంటాడుతాయి.
వదిలించుకోవడం ఎలా?
వృత్తిని అనుసరించి కంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులను సంప్రదించి ఐ డ్రాప్స్ తీసుకుంటూ ఉంటే సమస్యను అధిగమించవచ్చు.
-ఎంతోసేపు కంప్యూటర్ వర్క్ చేసి ఉంటారు కనుక కళ్లు బాగా అలసిపోయి ఉంటాయి. కనుక బయటకు వెళ్లేటపుడు తగిన కళ్లద్దాలను పెట్టుకుని వెళ్లాలి.
-యాంటి-రిఫ్లెక్షన్ కంప్యూటర్ స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి
- కంప్యూటర్ పని చేసేటపుడు కంటి రెప్పలను ఆర్పకుండా అలానే చూడొద్దు. కనీసం 10 నిమిషాలకోసారి చూపును పక్కకు తిప్పి విశ్రాంతినివ్వాలి.
-ఏసీకి మరీ దగ్గర్లో కూర్చుని పని చేయవద్దు. ఆ గాలి కూడా కళ్లపై ప్రభావం చూపుతుంది.
- ప్రతి గంటకోసారి కుర్చీలోంచి లేచి అలా బయటకు వెళ్లాలి.
- కంప్యూటర్ పనిచేస్తున్నప్పుడు కళ్లజోడు లేకుండా చేయవద్దు. వైద్యుడిని సంప్రదించి ఖచ్చితంగా కళ్లజోడు ధరించాలి. లేనట్లయితే త్వరగా కంటిచూపు మందగిస్తుంది.
-ప్రతి అర్థగంటకోసారి కళ్లను మూసుకుని కాస్తంత విశ్రాంతినివ్వాలి.
- కళ్లు మండుతున్నాయి అని ఏదో మెడికల్ షాపులో ఐ డ్రాప్స్ కొనేసి వేసుకోరాదు. అవి ప్రమాదం కలిగించవచ్చు.
- కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ దరి చేరకుండా ఉండాలంటే పై జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories....
Read More