సముద్రం నీలంగా ఉంటుందెందుకు...?
పిల్లలూ.. చెరువులు, బావులు, నదులలోని నీటిని చూస్తే సాధారణంగానే కనిపిస్తాయి. అదే సముద్రం నీళ్లు మాత్రం నీలంగా ఉంటాయి కదా..! మరి అవి అలా ఎందుకు ఉంటున్నాయో మీకెప్పుడయినా సందేహం వచ్చిందా...?! సముద్రం నీరు ఎప్పుడూ నీలం రంగులోనే ఉండేందుకు గల కారణం.. ఆకాశం రంగు నీటిపై ప్రతిబింబిచడం వల్లనే అని అనుకుంటున్నారా..? అలా అనుకోవటం తప్పు.ఎందుకంటే... నీటి అణువులు కాంతి కిరణాలను గ్రహించి వెదజల్లటం వల్లనే సముద్రం నీలిరంగులో కనిపిస్తుంటుంది. అంటే.. సూర్యుడి కాంతి భిన్న తరంగ దైర్ఘ్యాలు కలిగిన కాంతి తరంగాలతో నిర్మాణమై ఉంటుంది. ఈ తరంగాలు ఒక్కో తరంగ దైర్ఘ్యం వద్ద ఒక్కో రంగును సూచిస్తుంటాయి. నీలం రంగు తక్కువ తరంగ దైర్ఘ్యాన్ని, ఎరుపురంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటాయి.అయితే వాతావారణంలో వాయు, ద్రవ, ఘన స్థితులలో ఉండే వివిధ పదార్థాలు భూమిని చేరే సూర్యుడి కాంతిని గ్రహిస్తాయి. ఈ పదార్థాలన్నీ చాలా చిన్న పరిమాణంలో రేణువులుగా ఉండటంవల్ల తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని అంటే నీలం రంగు కాంతిని గ్రహించి వెదజల్లుతాయి. కాబట్టే ఆకాశం మనకు నీలంగా కనిపిస్తుంటుంది.అదే విధంగా సూర్యుడి కాంతి సముద్రాన్ని తాకగానే చిన్నగా ఉన్న సముద్రజల రేణువులు కూడా అతి తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న నీలం రంగునే గ్రహించి వెదజల్లుతాయి. కాబట్టి మనకు సముద్రం ఎప్పుడు చూసినా నీలంగానే కనిపిస్తుంటుంది. అంతేగానీ ఆకాశం రంగు నీటిపై ప్రతిఫలించి మాత్రం కాదు.