"గీతాంజలి"ని అనువదించిన బహుబాషావేత్త
చూడచక్కని నిండైన రూపం.. మాటలో, నడకలో, వ్యవహారంలో రాజఠీవి.. భావుకతలో ఉర్దూ కవుల శైలి, ఆలోచనలో అత్యాధునిక యోచన.. రాజకీయంలో నాటి స్వాతంత్ర్య సమరయోధులు వదలి వెళ్లిన పాదముద్రలు... వీటన్నింటినీ కలబోస్తే, సాహిత్య సాంస్కృతిక రాజకీయాల మేలు కలయిక అయిన డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి అవుతారు.స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి అయిన బెజవాడ గోపాలరెడ్డి... బెంగాలీ, గుజరాతీ, అస్సామీ, ఒరియా, మరాఠీ, ఉర్దూ, తెలుగు మొదలైన పదకొండు భాషల్లో నిష్ణాతుడు. బహుభాషా మూర్తిమత్వం కలిగిన అరుదైన వ్యక్తిగా ఆయన అనేక రచనలు కూడా చేసారు. పరిపాలనాదక్షుడుగా.. కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిగా.. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా తన విశిష్ట సేవలను అందించిన గోపాలరెడ్డి జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన స్మృతిలో...బెజవాడ గోపాలరెడ్డి.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం గ్రామంలో 1907 ఆగస్టు 7వ తేదీన జన్మించారు. తండ్రిపేరు పట్టాభి రామిరెడ్డి, తల్లిపేరు సీతమ్మ. స్వంత ఊర్లోనే కళాశాల చదువును పూర్తి చేసిన ఈయన, 1927లో శాంతినికేతన్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్యను పూర్తి చేశారు. తదనంతరం స్వాతంత్ర్యోద్యమ సంగ్రామంలో పాల్గొన్నారు.
"కవితలో వాస్తవికత కన్నా, బుద్ధికన్నా, కల్పనే మెండుగా వుండాలనీ, ఊహల తుషారంలో కనిపించే అందం కవితానందానికి మూలకందం. కవి కెమెరామెన్కాడు. చిత్రకారుడు కాడు.. అగోచరమైన ఊహను అందంగా పదాల్లో పొదివే నేర్పరి. అందువల్లనే కవి మానవ ప్రవృత్తులకు దర్పణం...
రవీంద్రనాధటాగోర్ స్థాపించిన శాంతినికేతన్లో వ్యక్తిత్వం సంతరించుకున్నారు బెజవాడ గోపాలరెడ్డి. టాగోర్ ఆయనకు ప్రాణం. అందుకే రవీంద్రుడి గీతాంజలిని, ఆయన రచనల ఆంతర్యాన్ని.. తెలుగులోకి అనువాదం చేసి తన గురుభక్తిని చాటుకున్నారు. అలాగే టాగోర్ శిష్యురాలైన లక్ష్మీకాంతమ్మను వివాహం చేసుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, గవర్నర్గా... ఇలా ఒకపాయగా ఆయన రాజకీయ జీవితం సాగింది. అలాగే మరోపాయగా కవిగా, రచయితగా గోపాలరెడ్డి జీవితం కొనసాగింది. ఒక్కమాటలో చెప్పాలంటే... గోపాలరెడ్డి జీవితంలో ప్రతికోణం వైవిధ్యం, పురోగమనమే...!కవిత్వం గురించి గోపాలరెడ్డి ఓ సందర్భంలో మాట్లాడుతూ... "కవితలో వాస్తవికత కన్నా, బుద్ధికన్నా, కల్పనే మెండుగా వుండాలనీ, ఊహల తుషారంలో కనిపించే అందం కవితానందానికి మూలకందం. కవి కెమెరామెన్కాడు. చిత్రకారుడు కాడు.. అగోచరమైన ఊహను అందంగా పదాల్లో పొదివే నేర్పరి. అందువల్లనే కవి మానవ ప్రవృత్తులకు దర్పణం కాగా, తాను సృష్టించే వూహలకూ కల్పించే భ్రమల సంకేతాలకూ మాత్రమే దర్పణమౌతాడు" అంటూ తన అంతరంగాన్ని ఆవిష్కరించారాయన..!"
ఎవరి మనోవృత్తి ప్రకారం వారు నడచుకోవటం మంచిదని.. ఒకరి సందేశాలతో, ఒకరి అడుగుజాడలలో ఇంకొకరు నడవరాదనీ.. పాతను పొగుడుతూ కూర్చోవద్దనీ, అస్తమించే సూర్యుడిని పూజిస్తూ ఉండకుండా ఉదయించే సూర్యుడికి స్వాగతం పలకాలని... వర్తమాన కవులు, కథకులు, విమర్శకులకు తన అమూల్య సందేశాన్నిచ్చిన బెజవాడ గోపాలరెడ్డి 1997వ సంవత్సరం మార్చి 9వ తేదీన పరమపదించారు.