Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రిటీషర్లకు సింహస్వప్నం "చంద్రశేఖర్ ఆజాద్"

Advertiesment
బాలప్రపంచం
భారత స్వాతంత్ర్యోద్యమంలో దేశమాత విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్‌ల సహచరుడిగా బ్రిటీషువారి గుండెల్లో రైల్లు పరిగెత్తించిన ఈయన మనదేశం గర్వించదగ్గ అసమాన వీరుడు.

భగత్ సింగ్ మార్గ నిర్దేశకుడిగా పేరుగాంచిన ఆజాద్ పూర్తిపేరు చంద్రశేఖర సీతారామ్ తివారి. ఈయన పండిత్‌జీగా కూడా పిలువబడ్డారు. ఈయన పెసరపప్పును కనుగొన్నవారిగా కూడా ప్రసిద్ధి. 1857 తరువాత సాయుధ పోరాటం చేసిన వీరుల్లో మొట్టమొదటివారు. దేశ ప్రజల రక్షణ కోసం ధర్మ యుద్ధమే సరైనది గట్టిగా నమ్మినవారు ఆజాద్.
తనను తానే కాల్చుకుని...!
  1931, ఫిబ్రవరి 27వ తేదీన తన ఇద్దరు సహచరులను కలిసేందుకు అలహాబాదులోని ఆల్ఫ్రెడ్ పార్క్‌కు చేరుకోగా, ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్‌ను లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పోలీసులకు...      


మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లా, బావ్రా గ్రామంలో పండిట్ సీతారామ్ తివారి, జగరానీ దేవీలకు 1906 జూలై 23వ తేదీన చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. ప్రాథమిక విద్యను సొంత గ్రామంలోనే పూర్తి చేసిన ఈయన వారణాసిలో సంస్కృత పాఠశాలలో హయ్యర్ సెకండరీ విద్యను అభ్యసించారు. ఈయన చిన్నప్పటినుంచి హనుమాన్ భక్తుడిగా ఉండేవారు.

1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో తీవ్రంగా కలతచెందిన ఆజాద్.. ఆ తరువాత 1921లో మహాత్మాగాంధీ నడిపిన సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నేరానికిగానూ ఈయన తన పదిహేనేళ్ల ప్రాయంలోనే అరెస్టయ్యారు.

విచారణ సందర్భంగా కోర్టులో "నీ పేరేంటి?" అని మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నకు ఆయన పెద్ద శబ్దంతో "ఆజాద్" అని అరచి చెప్పారు. దాంతో ఆయనకు మెజిస్ట్రేట్ 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. అయితే ప్రతి కొరడా దెబ్బకు ఆయన భారత్ మాతాకీ జై అంటూ గొంతెత్తి నినదించారు. ఇక అప్పటినుంచి చంద్రశేఖర్ ఆజాద్‌గా ఆయన పేరు స్థిరపడిపోయింది.

సహాయ నిరాకరణోద్యమం ఆజాద్‌లో దాగి ఉన్న విప్లవవాదిని మేల్కొలిపింది. ఎలాగైనా సరే భారతదేశాన్ని బ్రిటీష్‌వారి కబంధ హస్తాల నుంచి విడిపించాల్సిందేనని ఆయన బలంగా నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను స్థాపించారు. భగత్ సింగ్, సుఖదేవ్, తదితరులకు మార్గనిర్దేశకుడిగా మారిపోయారు.

ఆజాద్... 1926లో కకోరీ ట్రైన్ దోపిడీ, అదే సంవత్సరంలో వైశ్రాయి రైలును కాల్చివేయడం, లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగతీర్చుకోవడానికి 1928వ సంవత్సరంలో లాహోర్‌లో జె.పి. సాండర్స్‌ను కాల్చివేయడం తదితర హింసాత్మక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

ఒకానొక దశలో ఆజాద్ బ్రిటీష్ పోలీసులకు సింహస్వప్నంలా నిలిచారు. పోలీసుల హిట్‌లిస్ట్‌ను తయారు చేసుకున్న ఆయన వారిని చంపేదాకా వదిలిపెట్టలేదు. పదిహేనేళ్ల ప్రాయంలో అరెస్టయిన తరువాత బయటికి వచ్చి పోరాటంలో పాలుపంచుకున్న ఆజాద్... ఆ తరువాత తన మరణం దాకా కూడా ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కలేదు.

అయితే 1931, ఫిబ్రవరి 27వ తేదీన తన ఇద్దరు సహచరులను కలిసేందుకు అలహాబాదులోని ఆల్ఫ్రెడ్ పార్క్‌కు చేరుకోగా, ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్‌ను లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పోలీసులకు లొంగకుండా, ఒక్కడే పోరాడుతూ ముగ్గురు పోలీసులను హతమార్చారు. అలసిపోయేదాకా పోరాడిన ఆయన చివరి క్షణంలో తన వద్ద మిగిలిన ఒకే ఒక్క బుల్లెట్‌తో తనను తానే కాల్చుకుని అశువులు బాసారు.

చివరిదాకా ఆజాద్‌ను ప్రాణాలతో పట్టుకోవాలని భావించిన బ్రిటీష్ పోలీసులు సాధ్యంకాక... చివరికి ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ఎవరైనా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకున్నట్లయితే ఆజాద్‌కు పట్టిన గతే పడుతుందని.... ప్రజల్ని, ఇతర పోరాటకారులకు హెచ్చరిక జారీ చేస్తూ... వారు ఆజాద్ మృతదేహాన్ని బహిరంగ ప్రదర్శనకు ఉంచారు. అయితే ఆజాద్ మరణం ప్రజల్లో మరింత పట్టుదలను పెంచి, దేశభక్తిని రగిల్చింది. పోరాటంలోకి ఉరికేలా ప్రోత్సహించింది.

సాయుధ శక్తులు తమ ప్రాణాలు అర్పించినా అలుపెరుగని పోరాటం చేసినా... ప్రధానంగా అహింసాయుత పోరాటంగా రూపుదాల్చిన భారత స్వరాజ్య ఉద్యమం బ్రిటీషువారి అరాచక పాలనను నిట్ట నిలువునా కూల్చివేసింది. భారతమాతను బ్రిటీష్ దాస్య శృంఖలాలనుంచి విడిపించి జయకేతనం ఎగురవేసింది స్వాతంత్రోద్యమ పోరాటం. ఎందరో వీరుల బలిదానం ఫలితమే నేటి మన "స్వతంత్ర భారతదేశం".

Share this Story:

Follow Webdunia telugu