Publish Date: Mon, 09 Jun 2014 (13:10 IST)
Updated Date: Mon, 09 Jun 2014 (13:12 IST)
చాలా మందికి రాత్రిపూట భయానక కలలొస్తున్నాయా..? అయితే నవరత్నాలలో నీల రత్నాన్ని ధరించండని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అకస్మాత్తుగా జరిగే దొంగతనాలు, దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే నీలరత్నాన్ని ధరంచడం మంచిదని వారు చెబుతున్నారు.
ఇకపోతే.. ముఖకాంతికి, నేత్రకాంతికి నీలమును ధరించడం మంచిదని రత్నాల శాస్త్రం చెబుతోంది. శనిగ్రహదోషాలను, ఏలినాటి శని దోషాలను నివారించేందుకు నీలమును ధరించడం శ్రేయస్కరమని ఆ శాస్త్రం పేర్కొంటోంది. అదేవిధంగా ఆయుష్షు, బుద్ధి, బలము వృద్ధి చెందేందుకు నీలరత్నధారణ ఎంతో ఉపయోగపడుతుందని విశ్వాసం.
ముఖ్యంగా కుంభరాశి జాతకులు నీలరత్నాన్ని ధరిస్తే మంచి ఫలితాలుంటాయి. శాంత స్వభావం, ధర్మకర్మల యందు ఆసక్తి కలిగి ఉండే కుంభరాశి జాతకులు నీలరత్నాన్ని ధరించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇంగ్లీష్లో సెఫైర్ అని పిలువబడే ఈ రత్నములో ఇంద్రనీలము, మయూర నీలము, నీలమణి అనే రకాలున్నాయి.
నీలము ఎక్కువగా శుభ్రముగా ఉండవు. చారలు కలిగి ఉండే అసలైన నీలమును, నీరు నింపిన గ్లాసులో వేస్తే ఆ నీటి నుంచి నీల కిరణాలు వెలువడుతాయి. అదేవిధంగా అసలైన నీలమును ఎండలో వుంచినట్లైతే నీలపు కిరణాలను వెదజల్లుతాయి.
ఎలా ధరించాలంటే.. శనివారం సూర్యోదయానికి ముందే ధరించాలి. వెండిలోహముతో పొదిగించుకుని ఎడమచేతి మధ్యవేలుకు ధరించాలి. ధరించేందుకు ముందు పాలులో గానీ, గంగాజలములో గానీ నీలరత్నాన్ని శుద్ధిచేయాలి. అదేవిధంగా శనిధ్యాన శ్లోకమును 190 సార్లు ధ్యానించి ధరించడం ద్వారా దారిద్ర్యాలు తొలగిపోతాయని నమ్మకం.