కార్తీక ఏకాదశి నేడే: శివ, విష్ణువులను స్తుతించండి
కార్తీకమాసం అత్యంత పవిత్రమైంది. ఈ మాసంలో శివకేశవుల పూజ చేసేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాల్లో శివారాధన చేసేవారికి పుణ్యఫలం చేకూరుతుందని పురోహితులు అంటున్నారు. కార్తీక మాసం మొత్తం మీద కార్తీక ఏకాదశి, ద్వాదశులకు ప్రత్యేకత ఉంది. అందుకే ఈ రెండు తిథుల్లో వైష్ణవ సంబంధమైన పూజలు ఎక్కువ చేస్తుంటారు. కార్తీకమాసం అంటేనే సాధారణంగా శివప్రధానమైన పూజలు నిర్వహించడం కనిపిస్తుంటే.. వీటితో పాటు జరిగే విష్ణుపూజలు.. మనకు శైవ, వైష్ణవ భేదాలు పాటించకూడదనే విషయాన్ని ప్రభోదిస్తాయని పండితులు అంటున్నారు. కార్తీక మాసంలో వచ్చే తొలి ఏకాదశిని ప్రబోధ ఏకదాశి అంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైంది. ఆషాఢ ఏకాదశి (శయనైకాదశి) నాడు శయనించిన స్వామి (యోగనిద్ర) నుంచి ఈ రోజు మేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి.అందుచేత ఉత్తిష్ఠోత్తిష్ట గోవింద! త్యజనిద్రాం జగత్పతే, త్వయిస్తుపే జగత్ సుప్తం ఉత్థితే చోత్థితం జగత్" అనే ప్రబోధన మంత్రంతో ప్రార్థనచేసి, శ్రీమహావిష్ణువును అర్చించి, ఉపవాసముంటే విష్ణుమూర్తి అనుగ్రహంతో అనుకున్న కార్యాలు చేకూరుతాయి. అలాగే ఈ రోజున భాగవతంలో "అంబరిషోపాఖ్యానం" చదివినా, విన్నా మేలు జరుగుతుందని పురోహితులు అంటున్నారు.అలాగే కార్తీక శుద్ధ ఏకాదశికి ఎంతో వైశిష్ట్యం కలిగినది. ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు. దీనినే ఉత్థాన ఏకాదశిగా పిలుస్తుంటారు. ఈ ఏకాదశి నాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్లు పురాణాలు చెబుతున్నాయి.