విశాఖ లోక్ సభకు షర్మిల... పురంధేశ్వరి గల్లంతేనా...?!!
, శుక్రవారం, 28 మార్చి 2014 (10:30 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విశాఖపట్టణం లోక్ సభకు వైఎస్ షర్మిల దాదాపు పోటీ చేస్తారని అనుకుంటున్నారు. కడప లోక్ సభ తనకే కావాలని పట్టుబట్టిన చెల్లెమ్మను సోదరుడు ఒప్పించి విశాఖ నుంచి పోటీ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.ఇక ఇప్పుడు పోటీ చేస్తే విశాఖపట్టణం నుంచే చేస్తానని భీష్మించుకు కూర్చున్న పురంధేశ్వరికి షర్మిల పోటీ చేదు వార్తే. ఎందుకంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య స్టాండు తీసుకోవడంతోపాటు సీమాంధ్రలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. మరోవైపు షర్మిలకు సీమాంధ్రలో మంచి ఫాలోయింగ్ ఉన్నట్లు ఆమె నిర్వహిస్తున్న రోడ్ షోలే చెపుతున్నాయి. అలా చూసినప్పడు విశాఖపట్టణం లోక్ సభ ఖచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లడం ఖాయంలా అనిపిస్తోంది.మరోవైపు కడప లోక్ సభ నుంచి జగన్ బంధువు అవినాష్ రెడ్డి పోటీలోకి దిగనున్నాడు. ఈ సీటు కూడా దాదాపు ఖాయమయినట్లే. మొత్తమ్మీద సీమాంధ్రలో ఉన్న లోక్ సభ సీట్లలో 90 శాతానికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది.