మోడీతో పవన్ కళ్యాణ్... మోడీకే నా మద్దతు... జనసేన చీఫ్ ప్రకటన
, శుక్రవారం, 21 మార్చి 2014 (18:38 IST)
జనసేన అధినేత మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని శుక్రవారం సాయంత్రం కలిసి తన సంపూర్ణ మద్దతును తెలియజేశారు. నరేంద్ర మోడీతో సుమారు 45 నిమిషాలపాటు సమావేశమైన అనంతరం పవన్ ఓ ప్రైవేట్ ఛానల్ తో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం తెలుగువారికి ఎంతో ముఖ్యమని అన్నారు. ఇక జనసేన పార్టీ ఆవిర్భావం, లక్ష్యాలు అన్నీ మోడికి వివరించినట్లు తెలిపారు.ఈ భేటీకి పవన్ కళ్యాణ్ అహ్మదాబాద్లో బీజేపీ నేత సోము వీర్రాజుతో కలసి మోడీతో సమావేశమయ్యారు. భేటీ ముగిశాక పవన్ కళ్యాణ్ ఓ విలేకరితో మాట్లాడారు. తనకు పదవులపై వ్యామోహం లేదనీ, తెలుగు ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలన్న ఒకే ఒక్క ధ్యేయంతో మోడీని కలిసినట్లు చెప్పారు. తన సంపూర్ణ మద్దతు నరేంద్ర మోడికి ఉన్నదని వెల్లడించారు. ఏదో పదవుల కోసం తాను పార్టీ పెట్టలేదన్నారు. ప్రజల కోసమే జనసేన స్థాపించినట్లు తెలిపారు. నరేంద్ర మోడీ సైతం తెలుగు ప్రజల మధ్య ఎలాంటి ద్వేషపూరిత వాతావరణం లేకుండా చూడాల్సి ఉందని తనతో చెప్పినట్లు పవన్ వెల్లడించారు.