Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోల్ 2014... వైఎస్ షర్మిల, జగన్ సభలకు విపరీతమైన జనసందోహం...

Advertiesment
వైఎస్ షర్మిల
, శుక్రవారం, 21 మార్చి 2014 (14:33 IST)
WD
2014 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జగన్ సోదరి వైఎస్ షర్మిల, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ సీమాంధ్రలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వీరిద్దరి సభలకు విపరీతంగా జనం హాజరవుతున్నారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకుంటున్న నాయకుల తాకిడి పెరుగుతున్నప్పటికీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళుతున్నారు.

జగన్ మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి అయితే పెట్టబోయే 5 సంతకాల అంశాలను ప్రతి సభలోనూ వివరిస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) ముఖ్యమంత్రిగా తను పెట్టబోయే 5 సంతకాలు రాష్ట్ర ప్రజల తలరాతను మార్చేస్తాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం రోడ్ షోలో జగన్ మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

భారీగా జనసందోహం హాజరైన ఈ రోడ్ షోలో జగన్ మాట్లాడుతూ... తాను పెట్టబోయే 5 సంతకాల వివరాలను తెలిపారు. జగన్ మాటల్లోనే....

1వ సంతకం... అక్కచెల్లెమ్మల కోసం చేస్తాను, మీరు చేయాల్సిందల్లా స్కూలుకు మీ పిల్లల్ని పంపండి, అలా పంపితే ప్రతి నెల మీ ఇద్దరు పిల్లలకు రూ.1000 చొప్పున మీ ఖాతాలో డబ్బు జమ చేస్తాను. వారు ఇంజినీరింగో, మెడికల్ చదువో చదివేంత వరకూ నేనే చదివిస్తా. ఈ పథకం పేరు అమ్మ ఒడి.

2వ సంతకం... అవ్వ తాతల కోసం పెడతా. పెద్ద వయసులో కూలికి పోతూ కష్టపడుతూ తిండితిప్పలకు అలమటిస్తున్న అవ్వతాతల కోసం ఈ సంతకం పెడతా. వారికి ప్రతి నెల ప్రస్తుతం వస్తున్న రూ. 200 నుంచి రూ. 700 పింఛన్ పెంచుతా సంతకం చేస్తా. వారు పనికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చుని పింఛన్ డబ్బులతో హాయిగా బ్రతుకవచ్చు.

3వ సంతకం... రైతుల కోసం పెడతా. పండిన ధాన్యానికి గిట్టుబాటు ధర రాక రైతులు విలవిలలాడుతున్నారు. పండించిన ధాన్యానికి మార్కెట్లలో దారుణమైన రేటు ఉంటుందనీ, దీని నుంచి రైతులు బయటపడేందుకు రూ 3 వేల కోట్లు స్థిరీకరణకోసం 3వ సంతకం పెడతా.

4వ సంతకం డ్వాక్రా మహిళల కోసం పెడతాను. డ్వాక్రా మహిళలు నెలకు రూ. 2వేలు కట్టేందుకు పసిబిడ్డను తీసుకుని కూలికి వెళుతున్నారు. వారి కష్టాలను తీర్చేందుకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను. ఈ రుణ మాఫీ ఫైలుపై 4వ సంతకం చేస్తాను.

5వ సంతకం ఎక్కడ చేస్తానంటే... గ్రామాలు, మున్సిపాలిటీల్లో నివశించే ప్రజలు రేషన్ కార్డు, పింఛన్లు, ఇల్లు కట్టుకునేందుకు అవరమైన సర్టిఫికెట్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతుంటారు. వారలా తిరగకుండా, ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేకుండా గ్రామాల్లోనే ఓ కార్యాలయాన్ని తెరిచి అక్కడే వారికి అవసరమైన సర్టిఫికెట్లు ఇచ్చే యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాను. దీనికి సంబంధించిన ఫైలుపై 5వ సంతకం చేస్తాను అంటూ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.

ఇంకా సంవత్సరానికి 10 లక్షల ఇళ్లు కట్టిస్తాననీ, రాష్ట్ర రూపురేఖలు మార్చేస్తానని, తూర్పు గోదావరి రామచంద్రాపురంలో జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu