పశ్చిమ టీడీపీలో చేరికల జాతర... ఈలి నాని బెర్త్ పరిస్థితి...
, బుధవారం, 26 మార్చి 2014 (14:09 IST)
ఎన్నికలు 2014 సమీపిస్తున్నకొద్దీ సీమాంధ్ర జిల్లాల రాజకీయాలకు ఆయువుపట్టులాంటి పశ్చిమగోదావరి జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీలోకి ఇబ్బడిముబ్బడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి భారీస్థాయిలో నాయకులు వలస వస్తున్నారు కానీ పార్టీ మాత్రం బలపడుతున్నట్లు అనిపించడంలేదు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని, మరో నాయకుడు సత్యనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాదు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు కూడా టీడీపికే క్యూ కట్టారు. ఇంకా తణుకు ఎమ్మెల్యే కె నాగేశ్వరరావు, సమైక్యపార్టీ అంటూ చెప్పిన పితాని సత్యనారాయణ సైకిల్ ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఐతే జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జనభేరిలో జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూస్తుంటే తెదేపా పరిస్థితి ఏమిటో అనే గుబులు తమ్ముళ్లను తొలుస్తున్నట్లు సమాచారం. జగన్ మోహన్ రెడ్డి తన ప్రతి సమావేశంలోనూ చంద్రబాబును తూర్పారబడుతున్నారు. నిన్న విశాఖలో జగన్ మాట్లాడుతూ... పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఎన్నికలు వచ్చినపుడల్లా ఎన్టీఆర్ ఫోటో తీసి దండ వేయడం అలవాటుగా ఉందని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం రోడ్ షోలో కిక్కిరిసిన కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు నాయుడిని విమర్శనాస్త్రాలతో తూర్పారబట్టారు.ఆచరణ సాధ్యం కాని హామీలను చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నారనీ, సీమాంధ్రను సింగపూర్ చేస్తానని అంటున్నారనీ, అలా చెప్పే బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజన చేస్తుంటే ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు వైఖరి చూస్తుంటే ఒక వ్యక్తిని కత్తితో పొడిచి చంపేసి, చనిపోయిన వ్యక్తికి నేనే ముందు దండ వేస్తానంటూ పరుగు పెట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.2014
ఎన్నికలు ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉండదనీ, అందువల్లనే ఆచరణ సాధ్యం కాని ఎన్నో హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నారని అన్నారు. కనుక మరో 45 రోజుల్లో మన తలరాతలను మార్చే ఎన్నికల్లో ఆలోచన చేసి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సొంత కూతురును ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం లెక్క కాదని జగన్ విమర్శించారు.