కాంగ్రెస్ అంతు చూసేదాకా నిద్రపోను... జగన్ పార్టీ కూడా... పవన్
, బుధవారం, 2 ఏప్రియల్ 2014 (14:06 IST)
2014
సార్వత్రిక ఎన్నికలు మరో నెల రోజుల్లో జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు. ఆ పార్టీని రాష్ట్రంలో భూస్థాపితం చేసే వరకూ తాను నిద్రపోనని అన్నారు. రాష్ట్ర విభజనను అత్యంత పాశవిక రీతిలో చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మొన్నటివరకూ అక్కడక్కడ బహిరంగ సభలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దిన పత్రికలు, టీవీ ఛానళ్లలో తన ఇంటర్వ్యూలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీని ఏకి పారేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించి ప్రజల మధ్య విద్వేషాల్ని రగిల్చిన కాంగ్రెస్ పార్టీని తెలుగు ప్రజలు తరిమికొట్టాలన్నారు. అదేసమయంలో హఠాత్తుగా తన గురిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన కూడా పెట్టారు. వైఎస్సార్ బతికి ఉన్నప్పుడే రాష్ట్ర విభజనకు బీజాలు పడ్డాయన్నారు. ఇక జగన్ మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించకపోయినా... ఇంత తక్కువ సమయంలో కొందరు అన్నేసి కోట్లు ఎలా సంపాదిస్తారో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొన్నటివరకూ ఓ గది నిండా ఆయనపై అభియోగ పత్రాలు ఉంటే... ఇపుడవన్నీ ఎందుకు కాకుండా పోతాయా అంటూ ప్రశ్నించారు.