ఆశ్వీయుజ మాస బహుళ చతుర్దశినాడు సూర్యోదయమునకు ముందే నిద్ర లేవాలి. ఉదయం ఐదింటికి నిద్రలేచి.. తలస్నానము చేసి పూజామందిరము, ఇల్లు శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరమును రంగవల్లికలతో అలంకరించుకోవాలి.
తలస్నానము చేసి తెలుపు పట్టు వస్త్రాలను ధరించి పూజకు శ్రీలక్ష్మీదేవి (ఆకుపచ్చనిరంగు) ఫోటోను సిద్ధం చేసుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్ర పద్మములు, తెల్ల కలువపువ్వులు, నైవేద్యానికి కేసరీబాత్, రవ్వలడ్డులు, జామకాయలు సిద్ధం చేసుకోవాలి.
సాయంత్రం ఆరు గంటల నుండి పూజ చేయవచ్చు. పూజకు ముందు శ్రీ లక్ష్మీఅష్టోత్తరము, శ్రీ మహాలక్ష్మీ అష్టకం, శ్రీ లక్ష్మీసహస్రనామమును పారాయణము చేయాలి.
ఇంకా దీపావళి రోజున అష్టలక్ష్మీదేవాలయం దర్శించుకోవడం శుభఫలితాలనిస్తుంది. ఆలయాల్లో శ్రీ లక్ష్మీ కుంకుమపూజ, శ్రీ లక్ష్మీఅష్టోత్తర నామము వంటి పూజలు నిర్వహించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి.
దీపారాధనకు 2 ప్రమిదలు, 10 వత్తులు తీసుకోవాలి. పంచహారతికి ఆవునేతిని, దీపారాధనకు ఆవునెయ్యి వాడాలి. నుదుట కుంకుమను ధరించి, ఓం మహాలక్ష్మీదేవ్యై నమః అనే మంత్రాన్ని 108 మార్లు జపించి అనంతరం దీపారాధన చేయాలి. పూజచేసేటప్పుడు తామరమాల(స్త్రీలు) ధరించి, ఈశాన్యము వైపు కూర్చోవాలని పండితులు చెబుతున్నారు.