దీపావళి పండుగ... రాత్రి 10 గంటల తర్వాత టపాసులు కాల్చితే ఊరుకోం
, శనివారం, 3 నవంబరు 2012 (21:59 IST)
దీపావళి పండుగకు మరో 10 రోజుల సమయం ఉంది. అయితే తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి దీనిపై ముందే మేలుకుంది. విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యానికి తోడుగా దీపావళినాడు విచ్చలవిడిగా టపాసులు పేల్చడాన్ని కాస్తంత అడ్డుకునేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రజలకు కొన్ని నియమాలను సూచించింది. దీపావళి పండుగ సందర్భంగా కాల్చే టపాసులు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత మరుసటి ఉదయం 6 గంటల వరకూ కాల్చరాదని తెలిపింది. అంతేకాకుండా టపాసులను నివాస ప్రాంతాల్లో కాకుండా బహిరంగ ప్రాంతాలలో మాత్రమే కాల్చాలని తెలిపింది. పిల్లలను ఒంటరిగా బాణసంచాను కాల్చేందుకు అనుతించరాదనీ, టపాసులు కాల్చే చోట తప్పనిసరిగా నీరు, ఇసుక, కంబళి తదితరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.ఆసుపత్రులు, స్కూళ్లు, న్యాయస్థానం, దేవాలయాలకు సమీపంలో టపాసులు కాల్చరాదన్నారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా కాల్చినట్లయితే జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా పడుతుందని అధికారులు హెచ్చరించారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.