Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దీపావళి రోజున దీపాలకు నువ్వుల నూనె, మట్టి ప్రమిదలు శ్రేష్టం..

దీపావళి రోజున దీపాలకు నువ్వుల నూనె, మట్టి ప్రమిదలు శ్రేష్టం..
, శుక్రవారం, 6 నవంబరు 2020 (18:44 IST)
ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండగ. పూర్తి అమావాస్య నాడు జరుపుకునే పండగలు రెండు ఉన్నాయి. అవి మహాలయ అమావాస్య, రెండు దీపావళి.  భాద్రపద బహుళ అమావాస్య మహాలయ అమావాస్య, ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి. రాత్రివేళలో ఈ పండగను జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి, రకరకాల పండి వంటలు తయారుచేస్తారు.
 
సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి, వెలిగించి, గుమ్మాల్లో నేల మీద కొడుతూ... ‘దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి, పుట్ట మీద జొన్నకర్ర, పుటుక్కు దెబ్బ.. అని పాడతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోటవేసి, వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం.
 
తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మి దేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీపూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం.
 
అలాగే రామాయణంలో దీపావళి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం.. భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. 
 
నరకాసుర సంహారంతో అందరూ అనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడు మరణించగా, ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు.. కార్తీక శుద్ద విదియ ‘భగినీహస్త భోజనం’తో ముగుస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ దీపావళికి మీరు అభిమానించేవారికి బాదములను బహుమతిగా ఇవ్వండి