Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Advertiesment
దీపావళి
FILE
దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాసములో వచ్చే పండుగ. ఈ పండుగను అందరూ ఎంతో సంతోషంగా, దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి వేడుకగా జరుపుకుంటారు. పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండుగను నరకాసురుడిని సత్యభామ వధించిన నాడే జరుపుకుంటారు.

పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని అనంత సముద్రజలాలోకి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతరము ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్దరిస్తాడు. ఆ సమయములో వారికి ఓ పుత్రుడు కలుగుతాడు. ఆ పుత్రుని చూసి, నిషిద్దకాలమైన సంధ్యా సంయములో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షసలక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెపుతాడు.

ఆ మాటలకు బాధ పడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరము కోరుతుంది. దానికి విష్ణుమూర్తి అంగీకరించి, కన్నతల్లి చేతుల్లోనే ఇతనికి మరణము ఉందని హెచ్చరించి వెళ్లిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది.

ఇలా జనకమహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యొతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగ భావిస్తూ చక్కగా పూజచేసేవాడు. తన రాజ్యములోని ప్రజలందరిని ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధముగా కొన్ని యుగాలు గడిసిపోయాయి.

తర్వాత ద్వాపరయుగములో, అతనికి పక్క రాజ్యమైన శోణితపురముకు రాజైన బాణాసురునితో స్నేహము ఏర్పడింది. బాణాసురుడు స్త్రీలను తల్లిలాగ భావించడాన్ని నిరసించేవాడు. అతని దృష్టిలొ స్త్రీ ఒక భోగవస్తువంటాడు. ఈ ప్రభావము చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ ఆపేశాడు.

ప్రపంచములోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరిని బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యములో బంధించి వివాహమాడదలిచాడు. ఆ విధముగా 16,0000 మంది రాకుమార్తెలను బంధించాడు.

ఆ విధముగా అహంకారముతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గము మీద కూడా దండయాత్ర చేసి కన్నతల్లి అయిన అదితి మాత చెవికుండలాలను తస్కరించి దేవతలను, దేవమాతను అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారము అయిన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకుని సంహరించమని ప్రార్ధిస్తారు.

అదే సమయములొ భూదేవి సత్యభామ రూపములొ అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడి ఉంది. కాని ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవీ కూడా గుర్తులేవు. ఆ సత్యభామ దేవి నేను కూడా మీతోపాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుడిని అడుగుతుంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలసి అశ్వసైన్యంతో ప్రాగ్జ్యోతిష్యపురము వెళతాడు.

అక్కడ శ్రీ కృష్ణుడికి నరకాసురునికి మధ్య ఘోర యుధ్ధము జరుగుతుంది. కాని విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావము వలన నరకుడిని సంహరించుట సాధ్యపడలేదు. అందువలన శ్రీకృష్ణుడు యుధ్ధమధ్యలో మూర్చపోయినట్లు నటిస్తాడు. కళ్ళముందు భర్త మూర్ఛపోవటము చూసిన సత్యభామదేవి వెంటనే, విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురనమీదకు బాణము వేస్తుంది.

ఈ విధముగా తల్లి చేతులతోనే నరకాసురుడు మరణిస్తాడు. అప్పుడు 16,000 మంది రాకుమార్తెలు మమ్ములనందరిని నీవే వివాహమాడమని ప్రార్ధిస్తారు. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు వారిని అందరినీ వివాహమాడుతాడు.

ఈ విధముగా నరకుడు చనిపోయిన రోజుని నరకచతుర్దశి అంటారు. ఇది ప్రతి సంవత్సరము ఆశ్వీజమాసము కృష్ణ చతుర్దశి రోజు వస్తుంది. ఆరోజు నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు. ఆ తరువాత రోజు, అంటే ఆశ్వీజమాస అమావాస్య నాడు దీపావళి పండుగగా జరుపుకుంటారు.

ఏ రోజు సాయంత్రము ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించి చీకటిని ప్రారదోలతారు. ఇంకా లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. లక్ష్మీపూజతో పాటు దీపాలను వెలిగించడం ద్వారా వారి జీవితాలలో క్రొత్తవెలుగులు వస్తాయని భావిస్తారు. అలాగే మనం కూడా దీపాల వెలుగులతో దివ్వెల పండుగను వైభవంగా జరుపుకుందాం.. మరి అందరికి దీపావళి శుభాకాంక్షలు..!

Share this Story:

Follow Webdunia telugu