Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళి పండుగ ఎలా వచ్చింది

దీపావళి పండుగ ఎలా వచ్చింది
, మంగళవారం, 6 నవంబరు 2007 (11:38 IST)
WD PhotoWD
పిల్లలూ! దీపావళి పండుగ అంటే మీకు చాలా ఇష్టం కదూ! దీపావళి వచ్చిందంటే మీ కళ్ళలో వెలిగే సంతోషం ముందు కోటి మతాబుల వెలుగు కూడా దిగదుడుపే. స్కూల్ లేకపోయినా అమ్మ ఉదయాన్నే నిద్ర లేపడం కొంచెం కష్టమే అయినా అలమరలో దాచుకున్న టపాసులు గుర్తుకు రాగానే నిద్రమత్తు ఇట్టే వదిలిపోతుంది.

తల స్నానం చేసి, అమ్మ ఇచ్చిన కొత్త బట్టలు తొడుక్కుని, నాన్న కొని తెచ్చిన టపాసులను తీసుకుని మేడ మీదకు వెళ్ళి వాటిని కాలుస్తుంటే వచ్చే ఆనందమే వేరు. మరి మిమ్మల్ని ఇంత ఆనందపెడుతున్న దీపావళి ఎలా వచ్చిందనే సంగతి మీకు తెలుసా? ఆ సంగతులను ఇప్పుడు మనం తెలుసుకుందాం

దీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం మరియు భాగవతాలను చదివితే మీకు ఆ కథలు తెలుస్తాయి.

రామాయణం గురించి మీరు వినే ఉంటారు. అయోధ్యకు రాజు అయిన తండ్రి దశరధుని కోరిక మేరకు శ్రీరాముడు, సీతాలక్ష్మణ సమేతుడై పద్నాలుగేళ్ళు అడవిలో నివసించేందుకు వెళతాడు. వనవాసం చేస్తుండగా లంకాధీశుడైన పదితలల రావణాసురుడు సీతను ఎత్తుకు వెళతాడు.

webdunia
WD PhotoWD
ఆ తర్వాత రావణసురునితో జరిపిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీసమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆరోజు అమావాస్య... అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యావాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటున్నాం.

ఇక రెండవ కథగా నరకాసుర సంహారాన్ని చెప్పుకుందాం. ప్రాద్యోషపురానికి రాజు నరకాసురుడు. బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్వంతో నరకాసురుడు దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. నరకాసురుని పీడ విరగడవ్వడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగను జరుపుకున్నారు. ఆ పరంపర నేటికీ కొనసాగుతున్నది.

మూడవ కథగా పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మిదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. మరణాన్ని దరి చేర్చని అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజు లక్ష్మిదేవి ఉద్భవించింది. సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు.

నాలుగవ కథగా... భారతంలోని ఇతివృత్తాన్ని చెప్పుకుందాం. కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులు పదమూడేళ్ళు వనవాసం, ఒక సంవత్సర కాలం అజ్ఞాత వాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు.

ఇక చివరిదైన ఐదవ వృత్తాంతంగా మన రైతుల గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటారు.
webdunia
WD PhotoWD


పిల్లలూ! దీపావళి ఎలా వచ్చిందో తెలుసుకున్నారు కదా! ఈ కథలను మీ ఫ్రెండ్స్‌కు చెప్పి చూడండి... మీ నాలెడ్జ్‌కు వాళ్ళు ఆశ్చర్యపోకపోతే అప్పుడు అడగండి....

Share this Story:

Follow Webdunia telugu