Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పన్నీరు పక్కా పావులు... మెత్తబడిన సీఎం పళనిస్వామి... ఓపీఎస్ వెనుక ఉన్న ఆ అదృశ్యశక్తి ఎవరు?

అన్నాడీఎంకే పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల నుంచి శశికళ సారథ్యంలోని మన్నార్గుడి మాఫియాను పార్టీ నుంచి బహిష్కరించాలని కంకణం కట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ఆ దిశగా విజయం సాధించేలా కనిపిస్తు

పన్నీరు పక్కా పావులు... మెత్తబడిన సీఎం పళనిస్వామి... ఓపీఎస్ వెనుక ఉన్న ఆ అదృశ్యశక్తి ఎవరు?
, మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (09:29 IST)
అన్నాడీఎంకే పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల నుంచి శశికళ సారథ్యంలోని మన్నార్గుడి మాఫియాను పార్టీ నుంచి బహిష్కరించాలని కంకణం కట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ఆ దిశగా విజయం సాధించేలా కనిపిస్తున్నారు. ఇందుకోసం ఆయన సంధిస్తున్న అస్త్రాలు విజయం దిశగా దూసుకెళుతున్నాయి. దీంతో శశికళతో పాటు టీటీవీ దినకరన్‌పై బహిష్కరణ అస్త్రం పడనుంది. అదేసమయంలో అన్నాడీఎంకేను సైతం ఆయన తన గుప్పెట్లో పెట్టుకోనున్నారు. 
 
ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ఆమె స్నేహితురాలు శశికళ పావులు కదిపిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎంపికైనట్లు ప్రకటించుకున్నారు. అప్పటికే తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరు సెల్వంను ఆ పదవి నుంచి తొలగించారు. అలాగే, ముఖ్యమంత్రి కుర్చీ నుంచి కూడా పన్నీర్‌ను బలవంతంగా దించివేశారు. 
 
ఆ స్థానంలో తనకు విశ్వాసపాత్రుడైన ఎడప్పాడి కె.పళని స్వామిని సీఎం సీటులో కూర్చోబెట్టారు. జైలుకు వెళుతూ వెళుతూ తన సమీప బంధువు, అన్న కుమారుడైన టీటీవీ దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా కూడా చేశారు. శశికళ జైల్లో ఉన్నా.. అప్పటి నుంచి తమిళనాట ఆయనే చక్రం తిప్పుతూ వచ్చారు. జయలలిత ఉన్నప్పటి నుంచీ శశికళపై విముఖత కలిగిన పన్నీరు సెల్వం తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె, ఆమె వర్గంపై నిప్పులు కక్కుతున్నారు. తనను పార్టీ నుంచి బహిష్కరించిన ఆమెను, ఆమె కుటుంబాన్నే పార్టీలో లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో పార్టీ అధికారిక రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపారంటూ దినకరన్‌పై ఢిల్లీలో కేసు నమోదైంది. ఈ సమయంలోనే పన్నీర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. శశికళ కుటుంబం కాకుండా ఇంకెవరు.. ఏ పదవిని చేపట్టినా తనకు అభ్యంతరం లేదని ఆయన తొలి నుంచీ చెబుతూ వస్తున్నారు. ఎడప్పాడి వర్గంతో చర్చలకు కూడా ఆయన దీనినే ప్రాతిపదికగా చేశారు. ఆది నుంచీ పార్టీలో పని చేసిన తామంతా కలిసి ఉండాలని, మధ్యలో వచ్చి పెత్తనం చలాయిస్తున్న వారిని పక్కన పెట్టాలన్న ఏకైక ఎజెండాతో ఈ చర్చలు ప్రారంభించారు. ఓపీఎస్‌ వర్గం నుంచి మాజీ మంత్రి మాఫోయ్‌ పాండ్యరాజన్, కేపీ మునుస్వామి, జేసీడీ ప్రభాకరన్.. ఈపీఎస్‌ వర్గం నుంచి సీనియర్‌ మంత్రి డి.జయకుమార్‌ తదితరులు ఈ సయోధ్యకు పునాదులు వేసినట్లు తెలుస్తోంది.
 
పార్టీలో, ప్రభుత్వంలో దినకరన్ అరాచకాలు భరించలేని కొంతమంది మంత్రులు కూడా రాజీకి ముందుకొచ్చినట్లు తెలిసింది. నిజానికి, ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక వాయిదా పడినప్పటి నుంచే ఇరు వర్గాల మధ్య ఈ రాజీ చర్చలు ప్రారంభమయ్యాయి. ఆ నియోజకవర్గంలో అన్నాడీఎంకే (అమ్మ), అన్నాడీఎంకే (పురట్చతలైవి అమ్మ) విభాగాలు విడిపోవడంతో డీఎంకే విజయం సాధించడం ఖాయమని సర్వేలు తేల్చి చెప్పాయి. అప్పటి నుంచే ఇరు వర్గాల నేతల్లో అంతర్మథనం మొదలైనట్లు ఓపీఎస్‌ సన్నిహితులు చెబుతున్నారు. అయితే, ఈ పరిణామాలన్నింటి వెనుక ఏదో అదృశ్యశక్తి ఉందనీ, ఆ శక్తే మాజీ సీఎం పన్నీర్ సెల్వంను ముందుండి నడిపిస్తోందని అన్నాడీఎంకే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నాడీఎంకే నుంచి శశికళ - దినకరన్ బహిష్కరణ... ప్రధానకార్యదర్శిగా ఓ పన్నీర్ సెల్వం!