Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సొంత గూటికి నల్లారి కిరణ్‌.... ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా త్వరలో ప్రమాణ స్వీకారం

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సొంత గూటికే తిరిగి వెళ్ళిపోనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చిత్తూరు జిల్లాకు చెందిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ఏ పార్టీ ను

Advertiesment
Nallari Kiran Kumar Reddy
, బుధవారం, 21 సెప్టెంబరు 2016 (12:15 IST)
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సొంత గూటికే తిరిగి వెళ్ళిపోనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చిత్తూరు జిల్లాకు చెందిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ఏ పార్టీ నుంచి పిలుపు రాకపోవడంతో ఇక చేసేది లేక తిరిగి అదే పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇదేవిషయంపై రాహుల్‌గాంధీతో నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలోపు కిరణ్‌ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు కూడా స్వీకరించనున్నారు. కిరణ్‌కు ఏఐసీసీ అప్పగించేందుకు ఆ పార్టీ నేతలు సుముఖంగా కూడా ఉన్నారు.
 
సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో సీనియర్‌ నేత కె.రోశయ్య రాజీనామా చేసిన వెంటనే రంగంలోకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెరపైకి వచ్చారు. ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్‌ విఫ్‌గా పనిచేసిన అనుభవం ఉన్న కిరణ్‌కు అధిష్టానం ఒక్కసారిగా సీఎంను చేసింది. తాను సిఎం అవుతానని కలలో కూడా కిరణ్‌ అనుకుని ఉండే వాడు కాదని ఆయన సన్నిహితులే అప్పట్లో చెవులు కొరుక్కున్నారు. ఎవరూ దిక్కులేకపోవడంతో ఎలాగోలా పార్టీకి కిరణ్‌ ఆశాకిరణంలా కనిపించాడు. కిరణ్‌ సమర్థవంతంగానే పరిపాలనా చేసినా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ పదవికే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
 
పదవికే కాకుండా రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌పార్టీ కారణమైందని ఆ పార్టీకే రాజీనామా కూడా చేసేశారు. ఏపీ ప్రజలను తనవైపు తిప్పుకునేందుకు ఏకంగా సమైక్యాంధ్ర పేరుతో ఒక పార్టీ కూడా పెట్టేశారు. అయితే ఆ పార్టీ ఏవిధంగానూ ప్రజల్లోకి వెళ్లలేకపోయింది. దీంతో చివరకు ఏం చేయాలో పాలుపోక కొన్ని రోజుల పాటు సైలెంట్‌గా ఉన్నారు. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అమిత్‌షాతో చర్చలు జరిపి చివరకు పార్టీలో కీలక పోస్టులు కావాలన్న డిమాండ్‌ను ముందుంచాడు. అయితే కిరణ్‌ డిమాండ్‌ను ఏ రకంగాను ఒప్పుకులేదు బీజేపీ అధిష్టానం. చివరకు ఆ పార్టీలో కూడా చేరే అవకాశం లేకపోవడంతో ఆయన సైలెంట్‌ అయిపోయారు. 
 
ఇక చేసేది లేక తాజాగా సొంత పార్టీలో చేరాలన్న నిర్ణయానికి కూడా వచ్చేశారట. అయితే ఈసారి రాష్ట్ర రాజకీయాలు కాకుండా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్నది కిరణ్‌ అభిప్రాయం. అందుకే ఏకంగా ఏఐసీసీ పదవిని ఇవ్వాలని రాహుల్‌ని కోరాడట. ముందునుంచీ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి కిరణ్‌ అంటే ఇష్టం. అందుకే కిరణ్‌ అడగడమే ఆలస్యం ఏఐసీసీలో ప్రధాన కార్యదర్శిగా ఇస్తామని ఒప్పుకున్నారట. వచ్చే వారమే బాధ్యతలు చేపట్టాలని కూడా చెప్పారట. దీంతో కిరణ్‌ ఎగిరిగంతేసి ఏఐసీసీలోకి వెళ్ళేందుకు సిద్ధమైపోయారట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ ఫక్కీలో మహిళపై రౌడీషీటర్ అత్యాచారయత్నం... ఆపై హత్య