'ఆంధ్ర'లో అణు భూతాన్ని ఒప్పుకుందామా? తిప్పికొడదామా?... ఆగష్టు 6 హిరోషిమా డే
అణు విద్యుదుత్పత్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక వైజ్ఞానిక ఆవిష్కరణగా వ్యతిరేకించవలసిన అవసరం లేదు. ఉత్పత్తితో పాటు ప్రాణాంతక అణు వ్యర్థాల యాజమాన్యానికి చెందిన సాంకేతికత తగినంతగా అభివృద్ధి చెందని ప్రయోగాత్మక దశలోని వాటితో వాణిజ్యం చేయడం నేరం. ప్రపంచ యుద
అణు విద్యుదుత్పత్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక వైజ్ఞానిక ఆవిష్కరణగా వ్యతిరేకించవలసిన అవసరం లేదు. ఉత్పత్తితో పాటు ప్రాణాంతక అణు వ్యర్థాల యాజమాన్యానికి చెందిన సాంకేతికత తగినంతగా అభివృద్ధి చెందని ప్రయోగాత్మక దశలోని వాటితో వాణిజ్యం చేయడం నేరం. ప్రపంచ యుద్ధ రాకాసి సృష్టించిన అణు మారణహోమ స్మశాన వాటిక హిరోషిమా. యుద్ధానంతర ప్రపంచంపై పెత్తనం కోసం దురాశాపూరితంగా జపాన్ పారిశ్రామిక నగరాలు హిరోషిమా-నాగసాకిలపై అమెరికా అణు బాంబులు వేసింది.
మొదటగా ఆగస్టు 6న హిరోషిమాపై ‘లిటిల్ బాయ్’ పేరుతో వేసిన అణు బాంబు వల్ల లక్షా 40 వేల మందికి పైగా మృతి చెందితే, ‘ఫ్యాట్ మ్యాన్’ పేరుతో నాగసాకి పట్టణంపై వేసిన అణు బాంబు వల్ల 80 వేలకు పైగా ప్రజలు మరణించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 6ను హిరోషిమా దినంగాను, అణ్వస్త్ర వ్యతిరేక దినం(యాంటీ న్యూక్లియర్ డే)గాను అంతర్జాతీయ సమాజం జరుపుకుంటోంది.
అణు వ్యతిరేక ప్రజా ఉద్యమాల పర్యవసానంగా అణుశక్తిని పౌర అవసరాల కోసం విద్యుదుత్పాదన రూపంలో వినియోగంలోకి తీసుకొచ్చారు. అయితే హిరోషిమా ఉదంతం అణుశక్తిని మిలటరీ కార్యకలాపాలకు వినియోగించడంలోని మహా విధ్వంసంగా నిలిస్తే, ఉక్రెయిన్లో చెర్నోబిల్ అణు కేంద్ర విస్ఫోటనం పౌర అణు కార్యక్రమంలో జరిగిన చారిత్రకంగా మహా విషాదంగా నిలిచాయి. దాంతో ఏ రూపంలోనూ అణుశక్తి వినియోగాన్ని పూర్తిగా త్యజించాలని డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చింది.
తరుముకొస్తున్న పారిశ్రామికవిద్యుత అవసరాల కోసం అణు విద్యుదుత్పత్తిని చేపట్టాలని భారత పాలకులు భావిస్తున్నారు. అయితే గుజరాత్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో స్థానిక ప్రజలు అణు ప్లాంట్లకు వ్యతిరేకంగా పోరాడటం వలన కేంద్ర ప్రభుత్వం ఆ ప్లాంట్లన్నిటినీ ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతానికి తరలిస్తోంది. దాంతో దేశంలోనే అణు కేంద్రాల కూడలిగా ఆంధ్రప్రదేశ్ మారుబోతోంది. 2031 నాటి లక్ష్యమైన 60 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిలో 32 వేల మెగావాట్లకు పైగా విద్యుత్తును ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పబోయే అణు విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేయాలని కేంద్రం యోచిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోని కావలి ప్రాంతంలో రష్యాకు చెందిన ‘రోసాటం’ అనే అణు సంస్థ ఆరు అణు రియాక్టర్లను నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. తొషిబ-వెస్టింగ్టన్ అణు సంస్థ గుజరాత్లో 1100 మెగావాట్ల సామర్థ్యంగల ఆరు ఏపీ 1000 రియాక్టర్లను నెలకొల్పేందుకు ప్రయత్నించింది. అందుకోసం 777 హెక్టార్ల భూ సేకరణ ప్రయత్నాన్ని రైతాంగం వ్యతిరేకించగా ఆ రియాక్టర్లను ఏపీలో కొవ్వాడ వద్ద 2017 నాటికి నిర్మించాలని నిర్ణయం జరిగింది. ప్రస్తుతం కొవ్వాడ ప్రాంత ప్రజలు ఆ అణు కేంద్రాలకు వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టారు.
రాష్ట్ర విభజన తర్వాత నిధుల కొరతతో, కేంద్ర సహాయం కొరవడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన అణు కేంద్రాల ఏర్పాటుతో ఆర్థికంగా కొంత ఊరట కలిగే మాట ఎలా ఉన్నా, ఆదాయం కోసం రేడియో ధార్మికతకు రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని బలి పెట్డడం అమానుషం. అమెరికాలోని తీవ్రమైల్ ఐలాండ్, రష్యాలోని చెర్నోబిల్, జపాన్ ఫుకుషిమా లాంటి అణు విద్యుత్ కేంద్రాల్లో భారీ ప్రమాదాలే కాకుండా ప్రపంచ ప్రజలకు తెలియకుండా దాచేసిన వేలాది ఘటనల్లో క్యాన్సర్ లాంటి భయంకరమైసన వ్యాధులతో లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. ఫుకుషిమా ప్రమాదం తరువాత దేశంలో అనేకచోట్ల అణు విద్యుత్ కేంద్ర వ్యతిరేక ఉద్యమాలు ముందుకొచ్చాయి.
కొవ్వాడలోను అలాంటి ప్రజాప్రతిఘటనను ప్రభుత్వాలు ఎదుర్కొన తప్పదు. రాష్ట్రాభివృద్ధికి చేయూత పేరుతో ఖరీదైన, ప్రమాదకరమైన అణు విద్యుదుత్పాదనను ఆంధ్రప్రదేశ్పై రుద్దే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సంసిద్ధం కావాల్సిన తరుణమిది. అణుశక్తి వినియోగానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజా ఉద్యమాలు వచ్చాయి. దాంతో అనేక పాశ్చాత్య దేశాలు అణు విద్యుదుత్పత్తిని క్రమంగా నిలిపివేయాలని నిర్ణయాలు తీసుకున్నాయి.
అయితే ప్రపంచ ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో పర్యావరణహితమైన క్లీన్ ఎనర్జీ పేరుతో అణు విద్యుత్ ప్లాంట్లను వర్ధమాన, బడుగు దేశాలకు తరలించి ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాయి. అణు విద్యుదుత్పత్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక వైజ్ఞానిక ఆవిష్కరణగా వ్యతిరేకించవలసిన అవసరం లేదు. ఉత్పత్తితో పాటు ప్రాణాంతక అణు వ్యర్థాల యాజమాన్యానికి చెందిన సాంకేతికత తగినంతగా అభివృద్ది చెందని ప్రయోగాత్మక దశలోని వాటితో వాణిజ్య చేయడం నేరం. అపరిణత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అణు విద్యుత్ ప్లాంట్లను మనపై రుద్దుతున్న కార్పొరేట్ కుట్రను అందరూ వ్యతిరేకించాలి.