Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నన్ను తప్పించే దమ్మున్న మగాడు మీలో ఎవడ్రా'.. మంత్రులపై శివాలెత్తిన టీటీవీ దినకరన్

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌లను పార్టీ నుంచి వెలి వేశారు. వారి కుటుంబాలను పార్టీ, ప్రభుత్వం నుంచి పక్కన పెడుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి పళనిస్వామ

'నన్ను తప్పించే దమ్మున్న మగాడు మీలో ఎవడ్రా'.. మంత్రులపై శివాలెత్తిన టీటీవీ దినకరన్
, బుధవారం, 19 ఏప్రియల్ 2017 (08:36 IST)
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌లను పార్టీ నుంచి వెలి వేశారు. వారి కుటుంబాలను పార్టీ, ప్రభుత్వం నుంచి పక్కన పెడుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన ఆయన నివాసంలో మంగళవారం రాత్రి 9.45 గంటలకు జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
 
అంతకుముందు.. మంగళవారం ఉదయం నుంచే చెన్నైలో అత్యంత నాటకీయ పరిణామాలు జరిగిందాయి. రెండాకుల గుర్తును తిరిగి కైవసం చేసుకునేందుకు ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపిన వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడంతో బిత్తరపోయిన దినకరన్... బెంగళూరు జైల్లో ఉన్న శశికళతో మాట్లాడేందుకు బెంగుళూరుకు వెళ్లారు. తన ముఖం చూసేందుకు పిన్ని శశికళ ముఖం చాటేయడంతో మంగళవారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో చెన్నైకి చేరుకున్నారు. 
 
అడయారులోని తన నివాసానికి వచ్చీరాగానే... తన సన్నిహితులతో మంతనాలు జరిపారు. తన గైర్హాజరీలో ఏం జరిగిందంటూ తెల్లవారే వరకూ ఆరా తీశారు. అనంతరం ఉదయం 9.30 గంటలకే అన్నాడీఎంకే వైరి వర్గాల విలీన కార్యాచరణ కమిటీ దినకరన్ ఇంటికి వెళ్లింది. రాత్రి నుంచీ జరిగిన చర్చల సారాంశాన్ని వివరించింది. ‘పార్టీకి మీరు రాజీనామా చేస్తారా? లేక పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి మమ్మల్నే తప్పించమంటారా?’ అంటూ కమిటీ సభ్యులు ప్రశ్నించారు.
 
దీంతో దినకరన్ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. "నాకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండానే, నా ఆదేశాలు లేకుండానే ఎందుకు సమావేశం నిర్వహించాల్సి వచ్చింది? అడిగిన వారందరికీ మంత్రి పదవులు ఇచ్చి, అన్ని కోర్కెలూ తీరుస్తున్నా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ఆ సమావేశానికి ఎవరు నేతృత్వం వహించారు? ఎందుకు చేయాల్సి వచ్చింది?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ముఖ్యంగా.. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తప్పించి ఆ పదవిని పన్నీర్‌ సెల్వంకు ఇవ్వాలన్న ప్రతిపాదనపైనా ఆయన మండిపడినట్లు సమాచారం. 'మమ్మల్నే పార్టీ నుంచి తీసేస్తారా? అంత ధైర్యముందా? అలాంటి మగాడు ఎవడ్రా? పార్టీ అంటే ఏంటో తెలుసా? ఎలా నడపాలో తెలిసిన వారెవరు? ఇప్పుడు కొత్తగా మీకు కొమ్ములు మొలుచుకొచ్చాయా? ఎమ్మెల్యేల్లో అధిక భాగం మావారే. ఆ విషయం మరచి మాట్లాడుతున్నారా?' అంటూ దినకరన్‌ శివాలెత్తిపోయారు. 
 
తమను బయటకు గెంటి, ఓపీఎస్‌ను దరి చేర్చుకోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే వెంటనే తుడిచేయాలని, అంతదాకా వస్తే ఏం చేయడానికైనా తాను వెనకాడబోనని ఆయన తేల్చి చెప్పినట్లు తెలిసింది. దాంతో, 'ఇది అందరి అభిప్రాయం. పార్టీ అభివృద్ధి కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. పరిణామాలు చేయి దాటే వరకూ ఆలస్యం చేయకుండా మీరే రాజీనామా చేస్తే మంచిదన్నది అందరి అభిప్రాయం. లేకుంటే..' అంటూ మంత్రులు దినకరన్‌కు ముక్కుసూటింగా... స్పష్టంగా అర్థమయ్యేలా వివరించారు. దాంతో ఆయన మౌనం దాల్చినట్లు తెలిసింది. 
 
ఎంతసేపటికీ ఆయన నుంచి సమాధానం రాకపోవడంతో మంత్రులు బయటికి వచ్చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని జరగాల్సిన మిగిన క్రతువును రాత్రి 10 గంటల సమయంలో పూర్తి చేశారు. శశికళ పేరు ఎక్కడా ప్రస్తావించకుండానే టీటీవీ దినకరన్‌తో పాటు.. ఆయనకు చెందిన కుటుంబాన్ని మొత్తం పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి దూరంగా పెడుతున్నట్టు ఆర్థిక మంత్రి డి జయకుమార్ ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకేలో మన్నార్గుడి మాఫియా కథ ముగిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ అండతో గర్జించిన పన్నీర్, వణకిపోయిన పళని, శశికళ కథ కంచికి..!