తాను ఉండగా మరో మహిళతో అక్రమ సంబంధం ఎలా పెట్టుకుంటావని ప్రశ్నించిన భార్యను హోంగార్డుగా పనిచేసే కిరాతక భర్త ఒకరు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని గోదావరిఖనిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
రామగుండం కమిషనరేట్లో ఆవుల గట్టయ్య అనే వ్యక్తి హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో భర్త చనిపోయిన ఓ మహిళతో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్య రామలక్ష్మి(36)కి తెలిసింది. దీంతో భర్త అక్రమ సంబంధంపై నిలదీయడంతో ఆగ్రహానికి గురైన గట్టయ్య... భార్య రామలక్ష్మి తలను గోడకేసి కొట్టాడు.
ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.