హైదరాబాద్ నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన అశ్విని (25)కి మల్లంపేటకు చెందిన సాయిరామ్తో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి మూడేళ్లపాప కూడా ఉంది. వివాహ సమయంలో అశ్విని తల్లిదండ్రులు రూ.12 లక్షలు కట్నగా ఇస్తామని అంగీకరించి రూ.11 లక్షల నగదు, 18 తులాల బంగారం అందజేశారు.
అయితే, రెండు సంవత్సరాల తర్వాత సోదరి వివాహం కోసం ఆమె తల్లిదండ్రులు తమ భూమిని అశ్విని మామ కృష్ణ వద్ద తాకట్టు పెట్టి రూ.3 లక్షలు వడ్డీకి తీసుకున్నారు. కొంతకాలంగా కట్నం కింద ఇవ్వాల్సిన మిగిలిన డబ్బులు తీసుకునిరావాలంటూ అశ్విని భర్త, అత్తమామలు ఆమెపై ఒత్తిడి చేయసాగారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అశ్విని తన గదిలో, చిన్నారి కళ్లెదుటే ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
చాలాసేపటి వరకు చిన్నారి ఏడుస్తూ ఉండటంతో కుటుంబ సభ్యులు తలుపుతట్టారు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో కిటికీలో నుండి చూడగా అశ్విని ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అల్లుడు, అతని తల్లిదండ్రులు తన కూతురిని వేధిస్తున్నారని, అంతేకాకుండా ఆమె భర్త కొట్టాడని కూడా తమ దృష్టికి తీసుకొచ్చిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీనితో పోలీసులు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు.