మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్న కొడుకు బాధను చూడలేక, తమ కోసం కష్టపడుతున్న భర్తకు భారంగా మారలేక ఓ మహిళ దివ్యాంగుడైన తన కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో చోటుచేసుకుంది. సాక్షి చావ్లా అనే మహిళ తన భర్త దర్పణ్ చావ్లా, కుమారుడు దక్ష (11)తో కలిసి గ్రేటర్ నోయిడాలోని ఏస్ సిటీలో నివసిస్తోంది.
వారి కుమారుడు పదేళ్లుగా పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. కుమారుడి పరిస్థితి ఎంతకూ మెరుగుపడకపోవడంతో సాక్షి కొంతకాలంగా మానసిక వేదనకు గురవుతోంది. ఈ క్రమంలో ఆమె శనివారం సాయంత్రం అపార్టుమెంట్ 13వ అంతస్తు నుంచి కుమారుడితో సహా దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే... ఘటన జరిగినప్పుడు ఆమె భర్త ఇంట్లోనే వేరే గదిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి అరుపులు విని రక్షించడానికి వెళ్లేలోగా తన భార్య కుమారుడితో సహా కిందకు దూకేసినట్లు అతడు చెప్పినట్లు పేర్కొన్నారు. ఆత్మహత్యకు ముందు సాక్షి రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
అందులో మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్న తన కుమారుడి వల్ల తాము తీవ్ర వేదనకు గురవుతున్నట్లు తెలిపింది. తమ కోసం భర్త దర్పణ్ అనేక ఇబ్బందులు పడుతున్నారని.. ఆయనను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.