Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశ ప్రధానే కావొచ్చు.. ఆయన చెబితే మేము వినాలా?

దేశ ప్రధానే కావొచ్చు.. ఆయన చెబితే మేము వినాలా?
, ఆదివారం, 23 జూన్ 2019 (14:40 IST)
ప్రస్తుతం ఆయన దేశ ప్రధానమంత్రే కావొచ్చు. కానీ, ఆయన చెప్పిన మాట వినాల్సిన అవసరం అయితే మాత్రం తమకు లేదని పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ అంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ ప్రపంచ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లోభాగంగా, ఈనెల 16వ తేదీన భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య కీలక సమరం జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు మాజీ క్రికెటర్ అయిన పాకిస్థాన్ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. సొంత జట్టుకు ఓ సలహా ఇచ్చారు. 
 
భారత్‌తో జరిగే మ్యాచ్‌లో టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ ఎంచుకోవాలని ట్విట్టర్ ఖాతా ద్వారా సలహా ఇచ్చారు. కానీ, పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం దీన్ని పెడచెవిన పెట్టారు. టాస్ గెలిచినప్పటికీ... భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సర్ఫరాజ్ తీసుకున్న నిర్ణయానికి పాకిస్థాన్ జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంది. 
 
స్వయానా మాజీ క్రికెటర్‌ మాత్రమే కాదు.. పాకిస్థాన్‌కు తొలి ప్రపంచ కప్ అందించిన ఘనత ఇమ్రాన్ సొంతం. ప్రస్తుతం ఆయన రాజకీయ నేతగా మారి, దేశ ప్రధానిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి చేసిన సలహాను పాటించివున్నట్టయితే ఫలితం మరోలా ఉండేదని పాకిస్థాన్ అభిమానులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ విమర్శలపై పాక్ జట్టు ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ స్పందించాడు. ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే ఏం చేయాలనేది జట్టు సమష్టిగా తీసుకున్న నిర్ణయమని, ఎవరో (ఇమ్రాన్ ఖాన్) చెబితే తీసుకునే నిర్ణయం కాదని తేల్చి చెప్పాడు. టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలనేది జట్టు నిర్ణయమని స్పష్టం చేశాడు. జట్టు ఓటమికి అందరూ బాధ్యులేనని హఫీజ్ వ్యాఖ్యానించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సారీ సార్... క్షమించండి... అంపైర్‌కు రెండు చేతులెత్తి నమస్కరించన కోహ్లీ