మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో జరిగిన రెండో వన్డేలో ధోనీ సేన విజయకేతనం ఎగురవేసింది. స్థానిక మహారాణి ఉషే రాజే సింథియా మైదానంలో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఏడు వన్డే మ్యాచ్ల సిరీస్లో టీమ్ ఇండియా 2-0 తేడాతో ఆధిక్యంలో దూసుకెళ్లింది.
ఇంగ్లాండ్ ఓపెనింగ్ బౌలర్ ఆరంభంలో బ్రాడ్ బంతితో బెదిరించినా, కెప్టెన్ పీటర్సన్, ఆల్రౌండ్ ఫ్లింటాఫ్ మధ్యలో మెరుపులు మెరిపించినప్పటికీ 'టీమ్ ఇండియా' మాత్రం తలవంచలేదు. ఈ సిరీస్లో వరుసగా రెండు విజయాన్ని సొంతం చేసుకుంది.
అంతకుముందు టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెల్సిందే. నిర్ణీత యాభై ఓవర్లలో భారత జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో ఓపెనర్ గంభీర్ 70 పరుగులతో రాణించగా, భారత బెవాన్ యువరాజ్ సింగ్ అటు బ్యాటుతోనూ, ఇటు బంతితో రాణించాడు.
ఈ సిరీస్లో వరుసగా రెండో సెంచరీ (118) పూర్తి చేశాడు. ఈ సెంచరీ యూవీ కెరీర్లో పదోది. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో అత్యంత ప్రమాదకారిగా మారుతున్న పీటర్సన్-ఫ్లింటాఫ్ భాగస్వామ్యాన్ని విడదీయడమే కాకుండా, వారిద్దరిని వెంటవెంటనే పెవిలియన్కు పంపి భారత విజయానికి బాటలు వేశాడు.
చివర్లో యూసఫ్ పఠాన్ (50) బ్యాట్తో మెరుపులు మెరిపించడంతో భారత జట్టు ప్రత్యర్థి ముంగిట 293 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. బంతి నెమ్మెదిగా వస్తున్న ఇండోర్ పిచ్పై ఇంగ్లాండ్ భారీ విజయలక్ష్యాన్ని చేధించేందుకు దిగింది. ఆదిలోనే ఓపెనర్ బెల్ వికెట్ కోల్పోవడంతో ఆచితూచి ఆడిన ఇంగ్లీషు బ్యాట్స్మెన్స్ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయారు.
అయితే.. ఓ దశలో కెప్టెన్ పీటర్సన్-ఫ్లింటాఫ్లు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో భారీ లక్ష్యం సైతం మంచులా కరిగిపోయింది. అయితే వీరి భాగస్వామ్యాన్ని యువరాజ్ సింగ్ విడదీయడంతో భారత్ విజయం ఖాయమైంది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరూ కూడా భారీ భాగస్వామ్యాన్ని నిర్మించలేక పోయారు.
దీంతో పర్యాటక జట్టు 47 ఓవర్లలో 238 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత జట్టు 54 పరుగుల ఆధిక్యంతో విజయం చేకూరింది. భారత జట్టులో గంభీర్ 70, యువరాజ్ సింగ్ 118, యూసఫ్ పఠాన్ 50 (నాటౌట్), ఇంగ్లాండ్ జట్టులో షా 58, పీటర్సన్ 33, ఫ్లింటాఫ్ 43, ప్రియర్ 38 పరుగులతో రాణించారు.
అలాగే.. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్ నాలుగు వికెట్లను తీయగా, హార్మిసన్, పీటర్సన్, కాలింగ్వుడ్లు ఒక్కో వికెట్ను తీశారు. భారత బౌలర్లలో యువరాజ్ సింగ్ నాలుగు, సెహ్వాగ్ మూడు, హర్భజన్, యూసఫ్ పఠాన్ ఒక్కో వికెట్ను కూల్చారు.