యూడీఆర్ఎస్ను టీమ్ ఇండియా ఎందుకు వద్దంటోంది..!?
క్రికెట్ మ్యాచ్లో వివాదాస్పద అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (యూడీఆర్ఎస్)ని టీమ్ ఇండియా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరుగనున్న టెస్టు సిరీస్లో యూడీఆర్ఎస్ వద్దని టీమ్ ఇండియా స్పష్టం చేసింది. యావత్తు క్రికెట్ ప్రపంచంలో యూడీఆర్ఎస్ను భారత్ మాత్రమే వ్యతిరేకిస్తోంది. దీనిపై కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. 2008
సంవత్సరం శ్రీలంకలో పర్యటించిన భారత క్రికెట్ జట్టు యూడీఆర్ఎస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆ సిరీస్లో ఈ పద్ధతి భారత్కు అనుకూలించలేదు. దాదాపు 11 మంది అంపైర్ల ఫలితాలతో శ్రీలంక గెలుపును నమోదు చేసుకుంది. ఈ సిరీస్లో భారత్కు ఎదురైన చేదు అనుభవంతోనే యూడీఆర్ఎస్ అంటేనే భారత క్రికెట్ జట్టు జడుసుకుంటోంది. ప్రతి మ్యాచ్లోనూ ప్రత్యర్థి జట్లు యూడీఆర్ఎస్ విధానం అమలు చేయాలని ఆశిస్తుంటే.. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం యూడీఆర్ఎస్ వద్దు బాబోయ్ అంటోంది. ఈ విధానం ద్వారా టీమ్ ఇండియాకు వచ్చిన తంటా ఏమిటో అర్థం కావట్లేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ) ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని భారత్ ఎందుకు వద్దంటోందని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ విధానంలో కెప్టెన్ల అనుమతికి వీలుండటంతో భారత్ యూడీఆర్ఎస్ను నిరాకరించడం సులభమవుతోంది. కానీ దీన్నే కఠినతరం చేస్తే మాత్రం భారత్ మొండితనానికి ఫుల్స్టాప్ పెట్టినట్లవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2008
సంవత్సరం శ్రీలంకతో జరిగిన సిరీస్లో సచిన్ టెండూల్కర్ అవుట్ను మైదానం అంపైర్ తోసిపుచ్చాడు. కానీ, శ్రీలంక యూడీఆర్ఎస్కు అప్పీల్ చేసింది. ఈ విధానంలో సచిన్ను అవుట్ అయినట్టుగా అంపైర్ ప్రకటించారు. ఫలితంగా ఈ మ్యాచ్లో శ్రీలంక విజయంసాధించింది. అప్పటి నుంచి యూడీఆర్ఎస్పై సచిన్ టెండూల్కర్ విమర్శల వర్షం కురిపించాడు. ఈ విధానంలో వందశాతం క్లారిటీ ఉంటేనే దీన్ని అమలు చేయొద్దని సచిన్ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా యూడీఆర్ఎస్ విధానాన్ని భారత్ ఆడే మ్యాచ్ల్లో అమలు చేయనివ్వకుండా ధోనీ, బీసీసీఐలను మాస్టర్ కట్టడి చేస్తున్నట్టు సమాచారం. కానీ ప్రస్తుతం రనౌట్ ఇవ్వడం థర్డ్ అంపైర్ ఇచ్చే ఫలితంగానే మిగిలిపోయింది. అదేవిధంగా మ్యాచ్ల్లో అన్ని ఫలితాలు మారాలి. ఇదే క్రికెట్కు మంచిదని విశ్లేషకులు అంటున్నారు. సమీపంలో భారత్తో జరిగిన ఓ మ్యాచ్లో మైకేల్ క్లార్క్ క్యాచ్ ఇచ్చాడు. అయితే అది నో-బాల్గా ఉండవచ్చునని థర్డ్ అంపైర్ను సంప్రదించడంతో అది చివరి నో-బాల్కే పరిమితమైంది. ఈ అంపైర్ విధానం ఆ సమయంలో ఓ బ్యాట్స్మెన్ను కాపాడింది. ఇదేవిధంగానే పలు ఎల్బీడబ్ల్యూ ఫలితాలు అంపైర్ల తప్పిదాలతో ఇవ్వబడుతున్నాయి. ఈ విధంగా అంపైర్ల తప్పుడు ఫలితాలను చవిచూసిన వారిలో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఒకరు. లారా తర్వాత గంగూలీ. అంపైర్ల తప్పిదాలను థర్డ్ అంపైర్ విధానం పసిగట్టి మంచి ఫలితాలను ఇస్తోంది.
ఇదేవిధంగా యూడీఆర్ఎస్ పద్ధతిని కూడా భారత్ అంగీకరించడం మంచిదే అంటున్నారు విశ్లేషకులు. కానీ టీమ్ ఇండియా ఆటగాళ్ల గణాంకాలు ఈ విధానంలో తప్పేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఉదాహరణకు ఆసీస్తో జరిగిన మరిచిపోలేని సిడ్నీ టెస్టును తీసుకుందాం. ఈ మ్యాచ్లో కనీసం 14, 15 ఫలితాలు భారత్కు అనుకూలంగా వచ్చాయి. ఆ సమయంలో యూడీఆర్ఎస్ విధానం ఉండి ఉంటే తప్పకుండా ఆస్ట్రేలియా ఓటమిని చవిచూసి ఉంటుంది. అయితే ఆ సందర్భంగా ఈ విధానం లేదు. ఆ టెస్టు తర్వాతనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. భారత్ ఈ విధానాన్ని వ్యతిరేకించడానికి సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యలే కారణమని విశ్లేషకులు గట్టిగా వాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. 1992వ సంవత్సరం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ థర్డ్ అంపైర్ విధానంలో అవుట్ అయిన తొలి క్రికెటర్ కావడం గమనార్హం. అందుకే ఈ కొత్త విధానాన్ని భారత్ వ్యతిరేకిస్తోందని పలువురు విశ్లేషకుల వాదన. కాబట్టి క్రికెట్ మ్యాచ్ల్లో నిర్ధిష్టమైన ఫలితాల కోసం వన్డే క్రికెట్లతో పాటు టెస్టుల్లోనూ యూడీఆర్ఎస్ పద్ధతిని అమలు చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 22 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ లాంటి అద్భుత ఆటగాళ్ల మద్దతు అవసరమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సచిన్తో పాటు బీసీసీఐ, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలు కూడా ఈ విధానం అమలుకు పచ్చ జెండా ఊపాల్సి వుంది.