నాగ్పూర్లో ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న ఆఖరి టెస్ట్లో వందో టెస్ట్ ఆడుతున్న హైదరాబాద్ సొగసరి బ్యాట్స్మెన్ వీవీఎస్.లక్ష్మణ్ అర్థ సెంచరీతో రాణించాడు. 'మాస్టర్ బ్లాస్టర్' సచిన్ టెండూల్కర్ మరో శతకం సాధించి, శతకాల్లో ఇతర బ్యాట్స్మెన్స్కు అందనంత ఎత్తుకు చేరుకున్నాడు. ఈ తాజా సెంచరీ సచిన్ టెస్ట్ కెరీర్లో 40వది కాగా, ఆస్ట్రేలియాపై పదోది కావడం గమనార్హం.
అంతకుముందు టాస్ గెలిచిన భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెల్సిందే. ఓపెనర్లుగా బరిలోకి దిగిన వీరేంద్ర సెహ్వాగ్, విజయ్లు ఓపెనింగ్ భాగస్వామ్యంగా 98 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 98 పరుగులపై ఉండగా, కొత్త కుర్రాడు ఎం.విజయ్ (33) పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
అనంతరం క్రీజ్లోకి వచ్చిన రాహుల్ ద్రావిడ్ కూడా ఒక్క పరుగు చేయకుండానే డకౌట్ అయ్యాడు. దీంతో 99 పరుగుల వద్ద భారత్ మరో వికెట్ కోల్పోయింది. పిమ్మట వచ్చిన సచిన్, సెహ్వాగ్తో కలిసి ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరు వేగాన్ని పెంచాడు. సెంచరీ వైపు దూసుకెళుతున్న సెహ్వాగ్ (66)ను ఆసీస్ బౌలర్ క్రేజా బౌల్డ్ చేశాడు.
అయితే.. సచిన్తో కలిసి లక్ష్మణ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను చేపట్టాడు. వీరిద్దరు కలిసి 146 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వందో టెస్ట్ ఆడుతున్న లక్ష్మణ్ తన వ్యక్తిగత స్కోరు 64 పరుగుల మీద ఉండగా, క్రేజా బౌలింగ్లో హ్యాడ్డిన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరుకున్నాడు. అనంతరం గంగూలీ సహకారంతో సచిన్ తన జోరును కొనసాగిస్తూ 40వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో క్రేజా మూడు వికెట్లు తీయగా, వాట్సన్ ఒక్క వికెట్ పడగొట్టాడు.